భూపాలపల్లి అర్బన్: అసెంబ్లీ ఎన్నికలలో ఓటర్లు అందరికీ తప్పనిసరిగా ఓటరు స్లిప్పులు పంపిణీ చేసే విధంగా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని జాయింట్ ప్రధాన ఎన్నికల అధికారి సర్ఫరాజ్ అహ్మద్ ఆదేశించారు. మంగళవారం హైదరాబాద్ నుంచి సర్ఫరాజ్ అహ్మద్, ఇతర రాష్ట్రస్థాయి అధికారులతో కలిసి వెబ్ క్యాస్టింగ్ నిర్వహణ, ఓటరు స్లిప్పుల పంపిణీపై జిల్లా ఎన్నికల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా సర్ఫరాజ్ అహ్మద్ మాట్లాడుతూ.. క్రిటికల్ పోలింగ్ కేంద్రాలలో వెబ్ క్యాస్టింగ్ నిర్వహణకు సంబంధించి ప్రత్యేక ప్రణాళిక రూపొందించుకోవాలన్నారు. దీనికి అవసరమైన మేర యంత్రాంగాన్ని సిద్ధం చేసుకోవాలని చెప్పారు. స్థానికంగా అందుబాటులో ఉండే కంప్యూటర్ పరిజ్ఞానం ఉన్న యువతను వెబ్ క్యాస్టింగ్ కోసం వినియోగించుకోవాలని సూచించారు. ఓటరు స్లిప్పుల పంపిణీపై ప్రతి రోజూ నివేదికలు సమర్పించాలని ఆదేశించారు. ప్రతి ఓటరుకు తప్పనిసరిగా ఓటరు స్లిప్పులు అందేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఈ సమావేశంలో జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ భవేష్మిశ్రా, అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
జాయింట్ ప్రధాన ఎన్నికల అధికారి
సర్ఫరాజ్ అహ్మద్