సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): కళ్లం వద్ద ధాన్యాన్ని సమీపంలోని మిల్లుకు తరలించేలా ప్రభుత్వం కల్పించిన ఆఫ్లైన్ సౌకర్యాన్ని రైతులు వినియోగించుకోవాలని జేసీ తేజ్ భరత్ శుక్రవారం ఓ ప్రకటనలో కోరారు. వర్షాలు పడినప్పుడు రైతులు నష్టపోకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు. జిల్లాలో ఈ రబీలో 3.32 లక్షల మెట్రిక్ టన్నులకు గాను శుక్రవారానికి 2,05,584.300 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణకు కూపన్లను జనరేట్ చేశామన్నారు.
ఆన్లైన్లో 1896.720 మెట్రిక్ టన్నులు, ఆఫ్లైన్లో 2967.500 మెట్రిక్ టన్నుల ధాన్యం కొన్నామన్నారు. ఇప్పటి వరకు మొత్తం 18,297 మంది రైతుల నుంచి 165788.280 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామన్నారు. ధాన్యం కొనుగోలు చేసిన వారం రోజుల్లోపే రూ.65.33 కోట్లు రైతుల బ్యాంకు ఖాతాలకు జమ చేశామన్నారు. 14,889 ఎఫ్టీఓలకు గాను రూ.184.57 కోట్లు వచ్చే రెండు రోజుల్లో జమ చేస్తామన్నారు.