కాకినాడ క్రైం: జగనన్న ఆరోగ్య సురక్ష శిబిరాల నుంచి పలువురు రోగులు, అనారోగ్య బాధితులను ఉన్నత, నాణ్యమైన వైద్య సేవల కోసం డీఎంహెచ్వో డాక్టర్ నరసింహ నాయక్, డీఐవో డాక్టర్ రత్నకుమార్ ఆధ్వర్యంలో వైద్య ఆరోగ్యశాఖ బృందం జీజీహెచ్కు చేర్చింది. బుధవారం అధికారులు జీజీహెచ్ ఇన్చార్జి సూపరింటెండెంట్ డాక్టర్ హరి విజయకుమార్, డీసీఆర్ఆర్ఎంవో డాక్టర్ అనితల ఆధ్వర్యంలో సుమారు వంద మందిని జీజీహెచ్ ఓపీలో నమోదు చేశారు. అనంతరం ఆ బృందం ఆసుపత్రిలోని వివిధ విభాగాల్లో పర్యటించి టెలీహబ్ సేవలను పరిశీలించారు. ఎన్ఆర్సీ, డైస్ సేవలను పర్యవేక్షించారు. ఎన్ఐసీయూకి వెళ్లి నవజాత శిశువులకు అందుతున్న వైద్య సేవలను గమనించారు. పీడియాట్రిక్స్ హెచ్వోడీ డాక్టర్ మాణిక్యాంబతో మాట్లాడి ఆసుపత్రిలో చంటి పిల్లలకు అందుతున్న వైద్య సేవలను తెలుసుకున్నారు. పీడియాట్రిక్స్ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ విజయభాస్కర్ సహా ఆయా విభాగాల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.