ఆత్రేయపురం: వాడపల్లి జెడ్పీ హైస్కూల్లో పదో తరగతి చదువుతున్న ఏపుగంటి నాగేంద్ర కుమార్ జాతీయ స్థాయి నెట్బాల్ పోటీలకు ఎంపికయ్యాడు. ప్రధానోపాధ్యాయుడు ఎన్.వెంకట్రావు, పీఈటీ నాగబాబు మంగళవారం ఈ విషయం తెలిపారు. ఇటీవల శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరులో జరిగిన రాష్ట్ర స్థాయి నెట్బాల్ పోటీల్లో నాగేంద్ర కుమార్ ప్రతిభ చూపి, జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యాడని వివరించారు. జనవరి మొదటి వారంలో ఢిల్లీలో జరిగే జాతీయ స్థాయి నెట్బాల్ పోటీల్లో పాల్గొనే రాష్ట్ర జట్టుకు ప్రాతినిధ్యం వహించనున్నాడని చెప్పారు. నాగేంద్ర కుమార్ను సర్పంచ్ పోచిరాజు బాబూరావు, గ్రామస్తులు, స్కూల్ కమిటీ చైర్మన్ వై.శ్రీను తదితరులు అభినందించారు.
రూ.800 వ్రతం చార్జీ పెంపు
అన్నవరం: సత్యదేవుని సన్నిధిలో రూ.800 వ్రతం టికెట్ను మంగళవారం నుంచి రూ.వెయ్యికి పెంచారు. దీనిపై ఈ నెల మూడో తేదీన జరిగిన సమావేశంలో ఈఓ ఎస్ఎస్ చంద్రశేఖర్ ఆజాద్ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని ధర్మకర్తల మండలి ఆమోదించింది. ఈ నేపథ్యంలో దేవదాయ, ధర్మదాయ శాఖ కమిషనర్ సత్యనారాయణ పెంపుదలపై ఆదేశాలిచ్చారు. కాగా, దేవస్థానంలో రూ.300, రూ.1,500, రూ.2 వేల వ్రతాల టికెట్ల ధరలు మాత్రం పెంచలేదని ఈఓ తెలిపారు.