కాకినాడ రూరల్: మహాశక్తి యాగం వేదిక శ్రీపీఠానికి భక్తులు పోటెత్తుతున్నారు. అన్ని దారులూ శ్రీపీఠం వైపే అన్నట్టుగా జిల్లా నలుమూలల నుంచి, ఇతర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున మహిళలు తరలివస్తున్నారు. పరిపూర్ణానంద స్వామి దివ్య ఆశీస్సులతో నెల రోజులు పాటు నిర్వహించనున్న శత కోటి లలితా కుంకుమార్చన, కోటి దీపోత్సవం, బగళాముఖి హోమం, నక్షత్ర శాంతి పూజలు, తిథి పూజలు ఈ కార్తికంలో ఆధ్యాత్మికను పంచనున్నాయి. శ్రీపీఠంలో పంపిణీ చేసిన ప్రత్యేక వస్త్రాలను మహిళలు ధరించి దీక్ష తీసుకుని పూజల్లో పాల్గొంటున్నారు. రెండో రోజు బుధవారం శ్రీపీఠంలో స్వామి పరిపూర్ణానంద అనుగ్రహభాషణ అనంతరం లలితా కుంకుమార్చన జరిగింది. ఈ సందర్భంగా స్వామిజీ మాట్లాడుతూ కాకినాడకు వన్నె తెచ్చేలా యాగం జరుగుతోందన్నారు. ప్రతి ఒక్కరూ తమ కుటుంబం బాగు కోసం పూజలు చేసుకోవాలని సూచించారు. ఉదయం యాగశాలలో నక్షత్ర పూజ, తిథి పూజలు నిర్వహించారు.