అన్నవరం: కార్తికమాసం సందర్భంగా రత్నగిరిపై సత్యదేవుని ఆలయానికి భక్తుల తాకిడి మొదలైంది. బుధవారం ఉదయం నుంచి భక్తులు సత్యదేవుని సన్నిధికి తండోపతండాలుగా తరలి వచ్చారు. ఆలయ ప్రాంగణం, వ్రతమండపాలు, క్యూ లైన్లు నిండిపోయాయి. సాయంత్రం వరకు భక్తుల రద్దీ కొనసాగింది. సుమారు 30 వేల మంది స్వామివారిని దర్శించారు. స్వామివారి వ్రతాలు రెండు వేలు జరిగాయి. వృద్ధులు, వికలాంగులు, నేలమీద కూర్చుని వ్రతాలాచరించలేని వారి కోసం బల్లలు ఏర్పాటు చేశారు. స్వామివారి నిత్య కల్యాణంలో 30 మంది రూ.1,116 చొప్పున టిక్కెట్లు కొనుగోలు చేసి పాల్గొన్నారు. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.30 లక్షల ఆదాయం వచ్చినట్లు అధికారులు తెలిపారు. దేవస్థానం చైర్మన్ ఐవీ రోహిత్, ఈఓ చంద్రశేఖర్ అజాద్ ఏర్పాట్లు పర్యవేక్షించారు.
నేడు సత్యదేవుని నిజరూపదర్శనం
సత్యదేవుడు, అనంతలక్ష్మీసత్యవతీదేవి అమ్మవారు, శంకరుడు గురువారం నిజరూప దర్శనం ఇవ్వను న్నారు. పుష్పమాలలు, అవసరమైన వస్త్రాలు మినహా ఏ విధమైన ఆభరణాలను స్వామి, అమ్మవార్లకు అలంకరించరు. ఉదయం నుంచి మధ్యాహ్నం నివేదన వరకు నిజరూప దర్శనం కొనసాగుతుంది. అనంతరం స్వామి, అమ్మవార్లకు పట్టువస్త్రాలు, వజ్ర, స్వర్ణ ఆభరణాలతో అలంకరించి ప్రత్యేకంగా పూజలు చేసి భక్తులను దర్శనా నికి అనుమతిస్తారు.