తాళ్లరేవు: కోరంగి పోలీస్ స్టేషన్కు సమీపాన జాతీయ రహదారి–216పై శుక్రవారం ఆటోను కారు ఢీకొన్న ఘటనలో ఐదుగురికి తీవ్రగాయాలయ్యాయి. పోలీసుల కథనం ప్రకారం.. కాకినాడ నుంచి యానాం వైపు వెళుతున్న కారు.. ఎదురుగా ప్రయాణికులతో వస్తున్న ఆటోను ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న యానాంకు చెందిన పెస్సింగి జగ్గారావు, ఆటో డ్రైవర్ సంగాడి వెంకట నరసింహస్వామి, కోరంగి ఫార్మసీ కళాశాల విద్యార్థి పోతనపల్లి మోహిత్, తెనాలి కూచిపూడి గ్రామానికి చెందిన దేవరకొండ రాజేష్ గాయాలయ్యాయి. కారు నడుపుతున్న పెద్దబొడ్డు వెంకటాయపాలెం పాఠశాల హెచ్ఎం నడింపల్లి వెంకటరాజు కారులో బెలూన్లు తెరచుకోవడంతో స్వల్ప గాయాలతో బయటపడ్డారు. క్షతగాత్రులను 108లో కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వీరిలో ఒకరిని మెరుగైన వైద్యం కోసం కుటుంబ సభ్యులు కార్పొరేట్ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. మిగిలిన వారి పరిస్థితి నిలకడగా ఉంది. ఈ ప్రమాదంలో ఆటో పూర్తిగా ధ్వంసమైంది. కారు ముందు భాగం నుజ్జునుజ్జయ్యింది. కోరంగి ఎస్సై రవికుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
కట్నం వేధింపులు..
ఐదుగురిపై కేసు
కొవ్వూరు: కట్నం వేధింపులకు పాల్పడుతున్నట్టు అందిన ఫిర్యాదు మేరకు ఐదుగురిపై శుక్రవారం కేసు నమోదు చేశామని రూరల్ ఎస్సై జి.సతీష్ తెలిపారు. కుమారదేవం గ్రామానికి చెందిన బత్తి దేవికి, తాళ్లపూడి మండలం తిరుగుడుమెట్ట గ్రామానికి చెందిన లక్ష్మణ్కు గతంలో వివాహమైంది. ఇద్దరు పిల్లలున్నారు. అదనపు కట్నం తీసుకురావాలంటూ ఇటీవల భర్త లక్ష్మణ్, అతడి తల్లిదండ్రులు, బావ, ఆడపడుచు తనను శారీరకంగా, మానసికంగాను వేధిస్తున్నారని దేవి పోలీసులకు ఫిర్యాదు చేసింది.