● రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి
దాడిశెట్టి రాజా
● ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవం
తొండంగి: రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ను యువత ఆదర్శంగా తీసుకోవాలని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి దాడిశెట్టి రాజా సూచించారు. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఆదివారం బెండపూడి ఎస్సీపేటలో అంబేడ్కర్ విగ్రహానికి ఆయన పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అంబేడ్కర్తో పాటు ఎందరో మేధావులు రూపొందించిన భారత రాజ్యాంగం ప్రజాస్వామ్య పాలనకు, ప్రపంచ దేశాలకు స్ఫూర్తి అన్నారు. ప్రతిఒక్కరూ భారత రాజ్యాంగాన్ని గౌరవించాలని సూచించారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ నాగం గంగబాబు, వైఎస్సార్ సీపీ జిల్లా ఎగ్జిక్యూటివ్ సభ్యుడు గాబు రాజు, మండల వ్యవసాయ సలహా మండలి చైర్మన్ మద్దుకూరి వీర వెంకట సత్యనారాయణచౌదరి, పార్టీ మండల యూత్ కన్వీనర్ ఆరుమిల్లి ఏసుబాబు, సర్పంచ్ ఏలేటి దుర్గాదేవి, పార్టీ నాయకుడు ఏలేటి ధర్మరాజు పాల్గొన్నారు.
పంచారామ క్షేత్రంలో హైకోర్టు జడ్జి పూజలు
సామర్లకోట: స్థానిక పంచారామ క్షేత్రం శ్రీ బాలాత్రిపురసుందరీ సమేత కుమారారామ భీమేశ్వరస్వామి ఆలయంలో హైకోర్టు సేవా ట్రిబ్యునల్ జడ్జి రజనీరెడ్డి ఆదివారం ప్రత్యేక పూజలు చేశారు. ఆమెకు ఉత్సవాల ప్రత్యేకాధికారి అల్లు వెంకట దుర్గభవాని స్వాగతం పలికారు. మూలవిరాట్, అమ్మవారిని, ఉప ఆలయాలను ఆమె దర్శించుకున్నారు. ఆమెకు ఆలయ వేద పండితులు ఆశీర్వచనాలు అందజేశారు.
కాకినాడలో నేడు
జిల్లా స్థాయి స్పందన
బోట్క్లబ్ (కాకినాడ సిటీ): జగనన్నకు చెబుదాం – జిల్లా స్థాయి స్పందన కార్యక్రమం కలెక్టరేట్ స్పందన హాలులో సోమవారం ఉదయం 9.30 గంటల నుంచి జరుగుతుంది. అర్జీదారులు, జిల్లా అధికారులు ఈ విషయం గమనించాలని కలెక్టర్ కృతికా శుక్లా ఆదివారం ఒక ప్రకటనలో కోరారు.
నూకాంబిక ఆలయ ఈఓగా కృష్ణ
ఆలమూరు: చింతలూరు నూకాంబిక అమ్మవారి ఆలయ ఈఓగా ఎంఎస్ఆర్ కృష్ణ నియమితులయ్యారు. ఈ మేరకు జిల్లా దేవదాయ శాఖ నుంచి ఉత్తర్వులు అందినట్టు ఆలయ కమిటీ ఆదివారం తెలిపింది. మండలంలోని పెనికేరు గ్రూపు దేవాలయాలకు ఈఓగా పని చేస్తున్న కృష్ణ ప్రస్తుతం శ్రీనూకాంబిక అమ్మవారి ఆలయం ఈఓ (ఎఫ్ఏఐసీ) బాధ్యతలు చేపట్టారు. ఇప్పటి వరకూ ఈఓగా పని చేసిన ఉండవల్లి వీర్రాజు పిఠాపురంలోని పాదగయ కుక్కుటేశ్వరస్వామి ఆలయానికి బదిలీ అయ్యారు.