అన్నవరం: రత్నగిరి సత్యదేవుని ఆలయం బుధవారం తరలివచ్చిన భక్తులతో కిటకిటలాడింది. ఆలయ ప్రాంగణం, వ్రతమండపాలు, క్యూ లైన్లు భక్తులతో నిండిపోయాయి. సుమారు 40 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించగా 3,500 వ్రతాలు జరిగాయని అధికారులు తెలిపారు. 25 మంది భక్తులు స్వామివారి నిత్య కల్యాణంలో రూ.1,116 చొప్పున టిక్కెట్లు కొనుగోలు చేశారు. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.40 లక్షలు ఆదాయం వచ్చినట్లు అధికారులు తెలిపారు. భక్తులు రావిచెట్టు వద్ద జ్యోతులు వెలిగించి ప్రదక్షణ చేశారు.
గురువారం నుంచి సోమవారం వరకు రద్దీ
కార్తిక బహుళంలో సత్యదేవుని ఆలయానికి ఎక్కువ మంది భక్తులు వచ్చే ఆనవాయితీ ఉంది. దీంతో గురువారం నుంచి రత్నగిరి పై భక్తుల రద్దీ అధికంగా ఉండే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ప్రధానంగా శుక్రవారం నుంచి సోమవారం వరకు నాలుగు రోజులు సుమారు 25 వేల వ్రతాలు జరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. రోజుకు 50 వేల నుంచి 75 వేల వరకు భక్తులు వచ్చే అవకాశం ఉంది. ఇందుకు అనుగుణంగా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. తెల్లవారుజామున మూడు గంటల నుంచి వ్రతాలు, స్వామివారి దర్శనం ప్రారంభించనున్నట్లు వీరు తెలిపారు. అన్ని మండపాలలో ఏక కాలంలో 1,500 మంది భక్తులు స్వామివారి వ్రతాలు ఆచరించేలా ఏర్పాట్లు చేస్తున్నారు.