నిజాంసాగర్(జుక్కల్) : రాష్ట్ర ప్రభుత్వం వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, ఒంటరి మహిళలు, బీడీ, చేనేత, గీత కార్మికులకు ఆసరా పథకం కింద ప్రతినెలా పింఛన్ డబ్బులను పంపిణీ చేస్తోంది. వికలాంగులకు నెలకు రూ. 3,016 ఇస్తుండగా మిగితావారికి నెలకు రూ. 2,016 ఇస్తోంది. జిల్లాలో 1,54,540 మంది లబ్ధిదారులకు రూ. 330 కోట్ల మేరకు ఖర్చు చేస్తోంది. అయితే కొత్త పింఛన్లు మంజూరు చేయకపోవడంతో వేలల్లో లబ్ధిదారులు అనేక ఇబ్బందులు పడుతున్నారు.
ఆన్లైన్ చేస్తున్నప్పటికీ..
జిల్లాలోని అన్ని మండల పరిషత్ కార్యాలయాల్లో ఆసరా పెన్షన్ దరఖాస్తులు కుప్పలుతెప్పలుగా పెండింగ్ ఉన్నాయి. ఆసరా పెన్షన్ దరాఖాస్తులను మండల పరిషత్ కార్యాలయల్లో ఆన్లైన్ చేస్తున్నా సీఆర్డీ నుంచి మంజూరు చేయడం లేదు. అంతేకాకుండా వృద్ధాప్య పింఛన్ పొందుతున్న వారు చనిపోతే వితంతువులకు మరుసటి నెలలోనే పింఛన్ ఇస్తామ ని ప్రభుత్వం పేర్కొన్నప్పటికీ ఆచరణలో సాధ్యం కాలేదు. వృద్ధాప్య పింఛన్ పొందుతున్న భర్తలను కోల్పోయిన వితంతువులతో పాటు అనారోగ్యం, రోడ్డు ప్రమాదాల్లో భర్తలను కోల్పోయిన అభాగ్యుల వింతగోసను ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. భర్తలను కోల్పోయిన వితంతువులు ఆసరా పెన్షన్ కోసం జీపీ సిబ్బందికి అన్ని సర్టిఫికెట్లతో కూడిన దరఖాస్తులను సమర్పించినప్పటికీ పింఛన్ మంజూరు కావట్లేదని వారు వాపోతున్నారు.
పింఛన్ అందించి
ఆదుకోవాలి
పశువుల కాపరిగా పనిచేసిన నా భర్త సురేందర్ ప్ర మాదవశాత్తు బురదనీటి లో పడి మృతి చెందాడు. భర్తను కోల్పోయి ఆర్నెళ్లు కావస్తున్నా ఆసరా పెన్షన్ మంజూరు కాలేదు. పింఛన్ అందించి ఆదుకోవాలి.
– ఒడ్డె సుజాత, వితంతువు, బూర్గుల్
చిత్రంలో కనిపిస్తున్న వితంతువు పేరు తలారి బాలవ్వ. బూర్గుల్ గ్రామం. జుక్కల్ మండలం. ఆమె భర్త తలారి నాగయ్య గతేడాది డిసెంబర్ 12న మృతి చెందాడు. వృద్ధాప్య పింఛన్ పొందుతున్న నాగయ్య మృతి చెంది నాలుగు నెలలైంది. ప్రస్తుతం బాలవ్వకు వితంతు పింఛన్ కోసం దరఖాస్తు చేసుకున్నప్పటికీ మంజూరు కాలేదు. భర్తను కోల్పోయిన బాలవ్వ పింఛన్ ప్రస్తుతం అవస్థలు పడుతోంది.