కామారెడ్డి క్రైం: ఓటర్ జాబితాను పకడ్బందీగా రూపొందించడంలో బూత్ స్ధాయిలో రాజకీయ పార్టీల ప్రతినిధులు కీలక పాత్ర పోషించాలని కలెక్టర్ జితేష్ వి పాటిల్ సూచించారు. ఓటర్ల జాబితా రూపకల్పనపై బుధవారం కలెక్టరేట్లో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 791 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశామన్నారు. కొత్త ఓటర్ల నమోదుపై రాజకీయ పార్టీల ప్రతినిధులు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఈనెల 26, 27 తేదీలతోపాటు సెప్టెంబర్ 2, 3 తేదీల్లో ప్రత్యేక ఓటర్ల నమోదు కార్యక్రమం చేపట్టనున్నట్లు తెలిపారు.
ఓటర్ల జాబితాలో వీఐపీల పేర్లు తప్పనిసరిగా ఉండేలా చూసుకోవాలన్నారు. ఓటరు పేరు తొలగించేముందు తప్పనిసరిగా నోటీస్ ఇవ్వాలన్నారు. జాబితాలో నకిలీ ఓటర్లు లేకుండా చూడాలన్నారు. మృతి చెందిన ఓటర్ల పేర్లను జాబితా నుంచి తొలగించాలని సూచించారు. సమావేశంలో ఆర్డీవో శ్రీనివాస్ రెడ్డి, ఎన్నికల విభాగం పర్యవేక్షకుడు అనిల్ కుమార్, తహసీల్దార్లు ప్రేమ్ కుమార్, సాయిలు, ఇందిరా ప్రియదర్శిని, రాజకీయ పార్టీల ప్రతినిధులు ప్రభాకర్రెడ్డి, అనిల్ కుమార్, నరేందర్, బాలరాజు తదితరులు పాల్గొన్నారు.