సుభాష్నగర్: తనపై ఆరోపణలు చేస్తున్న ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తా ఈ నెల 13న ఉదయం 10 గంటలకు కంఠేశ్వర్ వద్ద నిర్వహించే చర్చకు సిద్ధమా అని బీజేపీ అభ్యర్థి ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా సవాల్ విసిరారు. తాను రెండకరాలు కబ్జా చేసినట్లు ఆధారాలతో చూపిస్తే అందుకు పదింతలు అర్భన్ అభివృద్ధికి కృషి చేస్తానని పేర్కొన్నారు. నగరంలోని వినాయక్నగర్ 23వ డివిజన్లో శనివారం ఇంటింటా ప్రచారం నిర్వహించారు. కరపత్రాలు పంపిణీ చేస్తూ కమలం గుర్తుకే ఓటేయాలని ప్రజలను అభ్యర్థించారు. అనంతరం తెలంగాణ తల్లి విగ్రహం వద్ద నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తాను ఎమ్మెల్యే బిగాల గణేశ్గుప్తాకు సవాల్ విసిరి 24 గంటలు గడిచినా.. స్పందించలేదన్నారు. ఏదేమైనా తాను ప్రకటించిన 13వ తేదీన నీలకంఠేశ్వర ఆలయం ఎదుట కూర్చుంటానని తెలిపారు. తాను జీవితమంతా కష్టపడి సంపాదించానని, తమలాగా కబ్జాలు చేసి, కమీషన్లు తీసుకుని అక్రమంగా సంపాదించలేదని ఎద్దేవాచేశారు. నాలుగేళ్ల క్రితం బీజేపీ కార్పొరేటర్ కుటుంబాన్ని బిగాల క్షోభకు గురిచేస్తే దసరా పండుగ చేసుకోలేదని గుర్తు చేశారు. ఇప్పుడు తాను ఎమ్మెల్యే బిగాల అవినీతి చిట్టా బయటపెడితే దీపావళి పండుగ చేసుకోవనే సంస్కారంతో ఈ నెల 13వ తేదీ నుంచి మొదలు పెడతానని తెలిపారు. గణేశ్ గుప్తా అవినీతిని అంతం చేయడమే తన మేనిఫెస్టో అని పేర్కొన్నారు. సమావేశంలో ఫ్లోర్లీడర్ గోపిడి స్రవంతిరెడ్డి, నాయకులు లక్ష్మణ్, అంతరెడ్డి హరీశ్రెడ్డి, సుధా, శ్రీపాల్ చారి, నాగోళ్ల లక్ష్మీనారాయణ, పంచరెడ్డి లింగం, కార్యకర్తలు పాల్గొన్నారు.
బిగాలకు సవాల్ విసిరిన బీజేపీ అర్బన్
అభ్యర్థి ధన్పాల్ సూర్యనారాయణ