నిజాంసాగర్: మండలంలోని బ్రాహ్మణపల్లి గేటు వద్ద సోమవారం రూ.61,200 నగదు పట్టుకున్నట్లు ఏఎస్సై రాజేశ్వర్ తెలిపారు. నాందేడ్ – సంగారెడ్డి జాతీయ రహదారిపై వెళ్తున్న ప్రైవేట్ వాహనాలను తనిఖీ చేయగా ఆటోలో వెళ్తున్న వ్యక్తి వద్ద నగదు దొరికిందన్నారు.
ప్రశాంత వాతావరణంలో
ఎన్నికలు నిర్వహించాలి
కామారెడ్డిఅర్బన్: జిల్లాలో ఎన్నికలు ప్రజాస్వామ్యయుతంగా, పక్షపాతం లేకుండా ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని తెలంగాణ ప్రజా ఐక్యవేదిక(టీపీ జేఏసీ) నాయకులు కలెక్టర్ జితేష్ వి పాటిల్కు విజ్ఞప్తి చేశారు. సోమవారం సాయంత్రం కలెక్టర్తో పాటు కామారెడ్డి రిటర్నింగ్ అధికారిని కలిసి వినతి పత్రాలు అందజేశారు. ఎన్నికల అధికారులు కొందరు అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నట్టు ప్రజల్లో అభిప్రాయం ఉందని, బాధ్యతాయుతంగా ఉండే విధంగా చర్యలు చేపట్టాలని కోరారు. ఓటర్లకు డబ్బులు, మద్యం పంపిణీపై నిఘా పెట్టాలన్నారు. కన్వీనర్ జి జగన్నాథం, కో కన్వీనర్ వీఎల్ నర్సింహరెడ్డి, న్యాయవాదులు ఎం వెంకట్రాంరెడ్డి, క్యాతం సిద్దిరాములు, ఎండీ అన్వర్ అలీ, పి బాల్రెడ్డి, బి అంగరాజ్ పాల్గొన్నారు.
‘జన గణన చేయలేమని బీజేపీ చేతులెత్తేసింది’
కామారెడ్డి రూరల్: జనగణన చేయలేమని సుప్రీంకోర్టుకు తెలిపి బీజేపీ చేతులెత్తేసిందని శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్ అన్నారు. సోమవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఆయన మాట్లాడారు. కామారెడ్డిలో సీఎం కేసీఆర్ గెలుపునకు అనుకూల పరిస్థితులు ఉన్నాయన్నారు. ముదిరాజుల్లో అవకాశం ఉన్నవారికి రాజకీయంగా బీఆర్ఎస్ అవకాశాలు కల్పించిందని తెలిపారు. కామారెడ్డిలో కొంతమంది ఆత్మగౌరవ భవనాలు, కుల సంఘాలకు సహాయం చేస్తూ ప్రలోభాలకు గురిచేస్తున్నారని తెలిసిందని, ఆత్మగౌరవ భవనాలను ఇచ్చింది బీఆర్ఎస్సే అన్నారు. జనగణన చేపడితే రిజర్వేషన్లకు అనుకూలంగా ఉంటుందని, జనగణన చేయడానికి బీజేపీ వెనుకంజ వేస్తోందన్నారు. వర్గీకరణ కోసం కమిటీ వేశామని ప్రధాని మోదీ చెప్పిన మాటలు మోసపూరితంగా ఉన్నాయన్నారు. కేసీఆర్ను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ముదిరాజ్ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు అల్లుడు జగన్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ పున్న రాజేశ్వర్ పాల్గొన్నారు.