మోర్తాడ్(బాల్కొండ): సాధారణ ఎన్నికల పోలింగ్ లో భాగంగా విధులు నిర్వహించిన ఉద్యోగులకు భ త్యం చెల్లింపులో అధికార యంత్రాంగం భిన్న వైఖ రి అవలంభించడంతో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నా రు. ఒక జిల్లాలో ఎక్కువ, మరో జిల్లాలో తక్కువ భత్యం చెల్లించడంపై ఉద్యోగులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. గురువారం పోలింగ్ ముగిసిన తరువాత ఉద్యోగులు అందుకున్న భత్యం వివరాలను తమ సహచర ఉద్యోగులతో షేర్ చేసుకోగా ఆ వివరాలు సామాజిక మాధ్యమాల్లో ట్రోల్ అవుతున్నాయి. రాష్ట్రం అంతటా ఒకే రోజు పోలింగ్ జరిగింది. ఈ సందర్బంగా అత్యధిక భత్యం రంగారెడ్డి జిల్లాలో చెల్లించగా అత్యల్పంగా నిజామాబాద్, నారాయణపేట్, నల్గొండ జిల్లాల్లో చెల్లించినట్లు తెలుస్తుంది. ఎక్కడైనా పోలింగ్ విధుల నిర్వహణ ఒకే విధంగా ఉండగా భత్యం చెల్లించడంలో తేడా ఎందుకనే ప్రశ్న ఉత్పన్నం అవుతుంది. రంగారెడ్డి జిల్లాలో పోలింగ్ అధికారి, అసిస్టెంట్ పోలింగ్ అధికారికి రూ.2,400 చొప్పున, ఓపీవోకు రూ.1,500 వరకు భత్యం చెల్లించినట్లు ఉద్యోగులు సామాజిక మాధ్యమాల్లో పేర్కొన్నారు. చేవెళ్లలో పీ వో, ఏపీవోలకు రూ.2,250 చొప్పున భత్యం చెల్లించారని వివరించారు. నిజామాబాద్ జిల్లాలో పీవో, ఏపీవోలకు రూ.1,700 చొప్పున, ఓపీవోలకు రూ.1,050 చొప్పున భత్యం చెల్లించారు. ఇతర జి ల్లాల్లోను తక్కువ భత్యం చెల్లించారు. ఇది ఇలా ఉండగా ఉద్యోగులకు మెను ప్రకారం భోజనం, టిఫిన్ అందించలేదని నాసిరకమైన ఆహార పదార్థాలను అందించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అనేక మంది ఉద్యోగులు కడుపులు మాడ్చుకుని విధుల్లో పాల్గొన్నామని వెల్లడించారు. పోలింగ్ స్టేషన్లలో సరైన వసతులు లేకపోయినా ఎన్నో అవస్థలకు ఓర్చి విధులు నిర్వహిస్తే టీఏ, డీఏ చెల్లింపులో నిర్ల క్ష్యం ఎందుకనే సంశయం వ్యక్తం అవుతుంది. 2018లో ఉద్యోగుల కోసం బస్సులను ఏర్పాటు చేయగా ఈసారి అలాంటి ఏర్పాట్లు ఏమి లేకపోవడంతో అవస్థలు పడుతూ అర్ధరాత్రి పూట ఇండ్లకు చేరుకున్నామని ఉద్యోగులు వాపోతున్నారు.