● ఆస్పత్రికి తరలింపు
కాల్వశ్రీరాంపూర్: మానవహక్కుల సంఘం మాజీ చైర్మన్ ఎరబాటి భాస్కర్రావు సోదరుడు స్వాతంత్య్ర సమరయోధుడు సీనియర్ సిటిజన్ హరిహర ఆలయం నిర్మాణకర్త రాజేశ్వర్రావును కాల్వశ్రీరాంపూర్లోని ఆయన నివాసంలో బుధవారం నాగుపాము కాటువేసింది. ఉగాది పండుగ సందర్భంగా పంచాగం చూస్తుండగా పెరట్లో నుంచి పామువచ్చి కాలుపై కాటువేసి అక్కడినుంచి వెళ్లిపోయింది. గమనించిన రాజేశ్వర్రావు అప్రమత్తమై ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులకు ఫోన్చేయగా హూటాముటిన కాల్వశ్రీరాంపూర్ ప్రభుత్వాస్పత్రికి తరలించి ప్రథమ చికిత్స చేయించారు. మెరుగైన వైద్యానికి 108లో కరీంనగర్కు తరలించారు. రాజేశ్వర్రావు కుమారుడు హైకోర్టు న్యాయవాది హైదరాబాద్ నుంచి కరీంనగర్ వచ్చినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన ఆరోగ్యస్థితిపై స్థానికులు ఆందోళన చెందుతూ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. సర్పంచ్ ఆడెపు శ్రీదేవిరాజు, ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు రఘుపతిరావు, తదితరులు ఉన్నారు.
రిటైర్డ్ డీసీపీకి సమన్లు జారీ
ధర్మపురి: బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే, మంత్రి కొప్పుల ఈశ్వర్పై ఎన్నికల పిటిషన్ను అమలుచేయడంలో విఫలమైనందుకు హైకోర్టు నుంచి మల్కాజ్గిరి డీసీపీకి సమన్లు జారీఅయ్యాయి. గత ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి అడ్లూరి లక్ష్మణ్కుమార్ అతి తక్కువ మెజార్టీతో ఓటమి చవిచూడగా ఓట్లలెక్కింపులో అవకతవకలు జరిగాయంటూ అందుకు ఎన్నికల అధికారి భిక్షపతి కారణమని లక్ష్మణ్కుమార్ హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఉద్యోగ విరమణ పొందిన బిక్షపతి బీఆర్ఎస్ మంత్రికి అనుకూలంగా ఫలితాల షీట్ను మార్చాడని ఆరోపించారు. కాంగ్రెస్ అభ్యర్థి తరుపున న్యాయవాది ధర్మేశ్ వాదిస్తూ రిటర్నింగ్ అధికారి రెండుసార్లు హాజరైనప్పటికీ సంబంధిత పత్రాలు సమర్పించడంలో విఫలమయ్యారని మరో రెండు సందర్భాల్లో గైర్హాజరైనట్లు వాదించారు. పోలీసుల వైఫల్యంపై అసంతృప్తి వ్యక్తంచేసిన న్యాయమూర్తి మల్కాజ్గిరి డీసీపీతో పాటు సంబంధిత పత్రాలతో ఈనెల 27న కోర్టుకు హాజరు కావాలని భిక్షపతిని ఆదేశించారు.