Telangana Crime News: TS Crime News: .. ఘోర రోడ్డు ప్రమాదం.. సజీవ దహనమైన డ్రైవర్‌..!
Sakshi News home page

TS Crime News: .. ఘోర రోడ్డు ప్రమాదం.. సజీవ దహనమైన డ్రైవర్‌..!

Published Sat, Aug 26 2023 12:40 AM

- - Sakshi

కరీంనగర్: సుల్తానాబాద్‌ మండలం కాట్నపల్లి గ్రామ శివారులోని రాజీవ్‌ రహదారిపై శుక్రవారం రాత్రి రెండు లారీలు ఢీకొని మంటలు చెలరేగాయి. మంటల్లో డ్రైవర్‌ సజీవ దహనం కాగా క్లీనర్‌ తీవ్ర గాయాలతో బయటపడ్డాడు. ఎస్సై విజేందర్‌, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. హరియానా రాష్ట్రం పాల్వల్‌ జిల్లా, హతిని తాలుకాకు చెందిన అన్నదమ్ములు ఫర్వీద్‌(25), ఇంజిమామ్‌ లారీ డ్రైవర్‌, క్లీనర్‌గా ఏలూరులో పని చేస్తున్నారు. ఏలూరు నుంచి ఏపీ 37టీఈ 5831 లారీలో టైల్స్‌ లోడ్‌ చేసుకొని మంచిర్యాల బయలుదేరారు.

ఈక్రమంలో సుల్తానాబాద్‌ మండలం కాట్నపల్లి పరిధిలో ఏపీ 29 టీబీ2382 నంబర్‌గల లారీ రాజీవ్‌ రహదారి పక్కనే ఉన్న మారుతి రైస్‌మిల్‌ నుంచి ధాన్యం లోడ్‌తో రోడ్డుపైకి వస్తున్న క్రమంలో టైల్స్‌ లోడ్‌తో ఉన్న లారీ వెనుక నుంచి వేగంగా ఢీకొట్టింది. దీంతో ఒక్కసారిగా ఇంజిన్‌ నుంచి మంటల చెలరేగాయి. లారీ క్యాబిన్‌లో ఇరుక్కున్న ఫర్వీద్‌ మంటల్లోనే సజీవ దహనం కాగా, క్లీనర్‌ ప్రమాదాన్ని గుర్తించి కిందకు దూకి తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని స్థానికులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈప్రమాదంతో ట్రాఫిక్‌ జామ్‌ అయింది. ఘటన స్థలానికి ఏసీపీ ఏడ్ల మహేశ్‌, సీఐ జగదీశ్‌లు చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

Advertisement
Advertisement