జ్యోతినగర్(రామగుండం): కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వరంగ సంస్థల్లో ఓబీసీ రిజర్వేషన్ కట్టుదిట్టంగా అమలు చేయాలని జాతీయ బీసీ కమిషన్ చైర్మన్ హన్స్రాజ్గంగారాం అహిర్ అన్నారు. స్థానిక జ్యోతిభవన్లో అదనపు కలెక్టర్ శ్యాంప్రసాద్ లాల్, ఎన్టీపీసీ, ఆర్ఎఫ్సీఎల్, జిల్లా అధికారులతో సమావేశమయ్యారు. జిల్లాలో ఓబీసీల శాతం, అక్షరాస్యత, సంక్షేమ హాస్టళ్ల నిర్వహణ, విద్యార్థుల ప్రిమెట్రిక్ స్కాలర్షిప్, పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్, రైతులు, వ్యవసాయ కూలీల వివరాలు, నిరుద్యోగులు, ఓబీసీ సర్పంచ్ల వివరాలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు ఓబీసీ సర్టిఫికెట్ జారీ విధానం, 9, పదో తరగతి విద్యార్థులకు ప్రీమెట్రిక్స్ స్కాలర్ షిప్, ఇంటర్ ఆపై చదివే వారికి పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ ప్రభుత్వం మంజూరు చేస్తోందని అధికారులు వివరించారు. ఎన్టీపీసీ, ఆర్ఎఫ్సీఎల్లో రిజర్వేషన్ అమలు తీరును అధికారులతో సమీక్షించారు. సమావేశంలో కమిషన్ సలహాదారుడు రాజేశ్కుమార్, ఎన్టీపీసీ సీజీఎం కేదార్ రంజన్పాండు, బీసీ అభివృద్ధి అధికారి రంగారెడ్డి, డీఆర్డీవో శ్రీధర్, డీఈవో మాధవి, సంక్షేమ అధికారి రౌఫ్ఖాన్ పాల్గొన్నారు.
ఆర్ఎఫ్సీఎల్లో ఉద్యోగ కుంభకోణంపై వినతిపత్రం ఆర్ఎఫ్సీఎల్లో ఉద్యోగాలు పెట్టిస్తామని కొంతమంది డబ్బులు వసూలు చేసిన అంశంపై బీజేపీ జిల్లా అధ్యక్షుడు రావుల రాజేందర్ హన్స్రాజ్గంగారాం అహిర్కు వినతిపత్రం అందించారు. స్థానిక ఎమ్మెల్యే అనుచరులమని చెప్పుకుంటూ యువతను తప్పుదోవ పట్టించారని, ఈ ఘటనలో కొందరు ఆత్మహత్య కూడా చేసుకున్నారని తెలిపారు.
జాతీయ బీసీ కమిషన్ చైర్మన్ హన్స్రాజ్ గంగారాంఅహిర్
ఎన్టీపీసీ, ఆర్ఎఫ్సీఎల్ అధికారులతో సమీక్ష