Sakshi News home page

భర్తను కడతేర్చిన భార్య..! అనుమానంతోనే ఇలా..

Published Thu, Oct 12 2023 5:02 AM

- - Sakshi

కరీంనగర్: అక్రమ సంబంధం ఏర్పర్చుకుని సొమ్మంతా వేరే ఆమెకు పెడుతున్నాడనే కారణంతో భర్తను భార్య అంతమొందించింది. ఈ ఘటన గోదావరిఖనిలో చర్చనీయాంశంగా మారింది. గోదావరిఖని వన్‌టౌన్‌ సీఐ ప్రమోద్‌రావు వివరాల ప్రకారం.. స్థానిక మార్కండేయ కాలనీకి చెందిన కొచ్చర ప్రవీణ్‌(42) గోదావరిఖని చుట్టుపక్కల ప్రాంతాల్లో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేస్తూ ఇళ్లు నిర్మించి విక్రయిస్తుంటాడు.

కొంతకాలంగా వేరే మహిళతో అక్రమ సంబంధం ఉందనే అనుమానంతో అతడితో భార్య లలిత రోజూ ఇంట్లో గొడవకు దిగేది. ఆస్తి వ్యవహారాలు తనకు ఏమి చెప్పడం లేదని కోపంతో ఉండేది. ఈ విషయాలన్నీ మనసులో పెట్టుకొని కోపంతో భర్తను చంపాలని నిర్ణయించుకుంది. ఈక్రమంలో తన భర్త వద్ద పనిచేసే రామగుండం ప్రాంతానికి చెందిన మచ్చ సురేశ్‌కు (సెంట్రింగ్‌ కార్మికుడు) తన బాధ చెప్పుకుంది.

భర్తను చంపాలని, దానికి సహకరించాలని కోరగా సురేశ్‌ ఒప్పుకున్నాడు. ఈనెల 10న అర్ధరాత్రి ఇంట్లో ప్రవీణ్‌ నిద్రిస్తుండగా లలిత కాళ్లు పట్టుకోగా సురేశ్‌, మరికొందరు నిందితులు దిండుతో అతడి ముఖంపై గట్టిగా అదిమిపట్టుకోగా శ్వాస ఆడక చనిపోయాడు. తర్వాత నిందితులు అక్కడి నుంచి పారిపోయారు. మృతుడి తల్లి మరియమ్మ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ప్రవీణ్‌కు భార్య, ముగ్గురు పిల్లలున్నారు. కాగా ఇంకా పూర్తి వివరాలపై కూపీ లాగుతున్నామని, నిందితులను త్వరగా పట్టుకుంటామని సీఐ తెలిపారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement