మల్లాపూర్(కోరుట్ల): మండల పరిషత్ సూపరింటెండెంట్ శఠగోపపు వెంకటేశ్వరస్వామి(55) అనారోగ్యంతో శుక్రవారం మృతిచెందాడు. మెట్పల్లి ఎంపీడీవో కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్గా పని చేస్తున్న వెంకటేశ్వరస్వామి 2019లో మల్లాపూర్ మండల పరిషత్ సూపరింటెండెంట్గా పదోన్నతి పొందాడు. కొంతకాలంగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న వెంకటేశ్వరస్వామి హైదరాబాద్లోని యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఆయనకు భార్య మమత, కుమార్తె, కుమారుడు ఉన్నారు. ఎంపీపీ కాటిపెల్లి సరోజన, జెడ్పీటీసీ సందిరెడ్డి శ్రీనివాస్రెడ్డి, ఎంపీడీవో జగదీష్, పంచాయతీ కార్యదర్శులు, మండల పరిషత్ కార్యాలయ అధికారులు, సిబ్బంది మృతుడి కుటుంబాన్ని పరామర్శించారు.
కువైట్లో బండపల్లి యువకుడు..
చందుర్తి(వేములవాడ): జీవనోపాధికి గల్ఫ్ దేశం పయనమైన ఓ యువకుడు జ్వరంతో మరణించాడు. చందుర్తి మండలం బండపల్లి గ్రామంలో శుక్రవారం విషాదం నింపింది. గ్రామస్తుల కథనం ప్రకారం.. రేగుల బాబు(36) అనే యువకుడు 11నెలల క్రితం జీవనోపాధి కోసం కువైట్ వెళ్లాడు. 20రోజుల నుంచి జ్వరంతో బాధపడుతున్నట్లు అతడి స్నేహితులు ఫోన్ ద్వారా సమాచారమిచ్చారు. గదిలో ఉన్న బాబు శుక్రవారం ఉదయం తలనొప్పిగా ఉందని చెప్పి కుప్పకూలిపోయాడు. ఆసుప్రతికి తరలించే క్రమంలో మృతిచెందినట్లు కుటుంబ సభ్యులకు తెలిపారు. మృతుడికి భార్య కల్యాణి, కూతురు(11), కుమారుడు(13) ఉన్నారు. ప్రభుత్వం ఆర్థిక సాయం అందించి ఆదుకోవాలని గ్రామస్తులు కోరారు.
రోడ్డు ప్రమాదంలో
యువకుడికి గాయాలు
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): మండల కేంద్రం శివారులోని పెట్రోల్ బంక్ వద్ద శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. పరిస్థితి విషమంగా ఉండడంతో స్థానిక ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. మండలంలోని కోరుట్లపేటకు చెందిన సడిమెల సాయి తన బైక్పై ఎల్లారెడ్డిపేటకు వచ్చి తిరిగి వెళ్తుండగా ఆటో వెనుక నుంచి వేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో గాయపడ్డ సాయిని స్థానికులు ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం యువకుడు చికిత్స పొందుతున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గాయపడ్డ యువకుడిని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, రజక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాలమల్లు పరామర్శించి, ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు.
బైక్ అదుపుతప్పి ఒకరికి..
ధర్మపురి: బైక్ అదుపుతప్పి యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. మంచిర్యాలకు చెందిన సంజయ్ అనే యువకుడు శుక్రవారం మంచిర్యాల నుంచి జగిత్యాలకు వెళ్తుండగా.. ధర్మపురి మండలం బుద్దేశ్పల్లె సమీపంలో వాహనం అదుపుతప్పి తలకు తీవ్ర గాయాలయ్యాయి. ఈఎంటీ అనిల్కుమార్ ప్రథమ చికిత్స చేసి వెంటనే 108 అంబులెన్సులో జగిత్యాల ఏరియా ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు.