కొత్తపల్లి(కరీంనగర్): గుట్టలను అక్రమార్కులు తోడేస్తున్నారు. కమాన్పూర్ శివారులోని గుట్టలను అక్రమంగా తవ్వుతూ గుట్టుచప్పుడు కాకుండా తరలిస్తూ మట్టి దందాను జోరుగా సాగిస్తున్నారు. అధికారులు ఎన్నికల విధుల్లో ఉండగా.. అక్రమార్కులు మట్టి రవాణాపై దృష్టి సారించారు. కమాన్పూర్ గ్రామ శివారు 116 సర్వే నెంబర్లోని గట్టు మల్లన్న గుట్టను తవ్వుతూ మట్టిని అక్రమంగా తరలిస్తున్నారు. అక్రమ సంపాదనే ధ్యేయంగా కొంతమంది దళారులు ప్రకృతి సంపదను కొల్లగొడుతూ యథేచ్ఛగా మట్టిని తరలిస్తున్నారు. రూ.లక్షలు విలువ చేసే మట్టిని అక్రమంగా తరలిస్తూ అక్రమార్కులు సొమ్ము చేసుకుంటున్నారు. కమాన్పూర్లోని గట్టు మల్లన్న గుట్టను మంగళవారం జేసీబీతో తోడుతూ ట్రాక్టర్ల ద్వారా అక్రమ రవాణాకు ఒడిగట్టారు. ప్రకృతి సంపదను కొల్లగొడుతున్న అక్రమార్కులపై అధికారులు దృష్టి సారించాలని గ్రామస్తులు కోరుతున్నారు.
ఎన్నికల విధుల్లో అధికారులు.. గుట్టను తోడేస్తున్న అక్రమార్కులు
గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న వైనం
చట్ట ప్రకారం చర్యలు
ప్రభుత్వ అనుమతి లేకుండా గుట్టల నుంచి అక్రమ తవ్వకాలు చేపడితే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం. జేసీబీ, ట్రాక్టర్లను సీజ్ చేస్తాం. ఎన్నికల విధుల్లో నిమగ్నమై ఉండడంతో అక్రమ రవాణాపై దృష్టి సారించలేకపోయాం. పర్యవేక్షించాలని ఆర్ఐని ఆదేశించా. – రాజేశ్, తహసీల్దార్, కొత్తపల్లి