పెగడపల్లి(ధర్మపురి): అరె తమ్మి.. గి ఊల్లె మనకు మంచి పట్టున్నట్టుంది. ఓటడిగిన ప్రతొక్కలు భరోసా ఇస్తుండ్రు. జర మన సు నిమ్మలమైతంది అంటూ ఓ ఊరిలో ప్రచారం ముగిస్తూ ఊరు దాటిన ఓ పార్టీ నాయకుడు తన అనచరుడితో అన్నడు. ఏమోనన్న.. నాకై తే గీల్ల(ఓటర్ల) కిట్కు తెలుత్తలేదు. గిప్పు డు మనకే ఓటేస్తమని మాటిచ్చిన గాల్లంతా.. నిన్ననే ఎదుటి పార్టోల్లకు మాటిచ్చిండ్రనే మాట విన్న. పెచారం మద్దెల పొరగాల్లు మాట్లాడుతుంటే జెర చెవి పెట్టిన. ప్చ్.. ఏం జేస్తమన్నా.. దునియా గిట్ల మారవట్టె అంటూ తమ నాయకుడికి గుండె నిబ్బరాన్ని పెంచాడు. అవ్ తమ్మీ.. పక్కగా సెప్పినవ్. గప్పటి ఎలచ్చన్ల లెక్క గిప్పుడు ఓటర్లు లేరు. శానా మార్పులొచ్చినయ్. లీడర్ల మాటలిని గాల్లు కూడా మస్తుగా మాటలు నేర్చిండ్రు. ఏం జరుగుతదో సూద్దాం అంటూ కారెక్కి పక్క ఊర్లో ప్రచారానికి బయలుదేరిండు.
చికిత్స పొందుతూ వివాహిత మృతి
ధర్మారం(ధర్మపురి): మండలంలోని గోపాల్రావుపేట గ్రామానికి చెందిన బద్దం మౌనిక (24) అనే వివాహిత సోమవారం ఆత్మహత్యాయత్నం చేయ గా చికిత్స పొందుతూ మంగళవారం తెల్లవారుజామున మరణించినట్లు ఎస్ఐ సత్యనారాయణ తెలిపారు. మౌనికకు వివాహమై నాలుగు సంవత్సరాలు గడిచినా సంతానం కలగలేదని మనోవేదనగురై, ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు తాగింది. ఆ తర్వాత వచ్చిన కుటుంబసభ్యులు గమనించి, వెంటనే కరీంనగర్లోని ఓ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందింది. మృతురాలి తండ్రి దొడ్ల కొమురయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ పేర్కొన్నారు.
బీజేపీ కార్యకర్తలపై కేసు
కరీంనగర్ క్రైం: నిబంధనలకు విరుద్ధంగా ఎన్నికల ప్రచారం నిర్వహించినందుకు బీజేపీ కార్యకర్తలపై కేసు చేసినట్లు కరీంనగర్ వన్ టౌన్ పోలీసులు తెలిపారు. బీజేపీ నాయకుడు బాస సత్యనారాయణరావు నగరంలోని అశోక్నగర్లో ప్రచారం కోసం సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు అనుమతి తీసుకున్నారని అన్నారు. కానీ కార్యకర్తలు మంగళవారం ఉదయం ఇంటింటి ప్రచారం నిర్వహిస్తూ ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించారని పేర్కొన్నారు. వారిపై ఎన్నికల పర్యవేక్షణాధికారి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు.