వీర్నపల్లి(సిరిసిల్ల): తండ్రి మరణాన్ని తట్టుకోలేక మనోవేదనతో కొడుకు మృతిచెందిన సంఘటన మండలంలోని భూక్యతండాలో విషాదం నింపింది. గ్రామస్తులు తెలిపిన వివరాలు. భూక్య శంకర్(48) తన కొడుకు ఆరోగ్యం బాగు చేయించేందుకు రూ.10 లక్షల వరకు అప్పులు చేసి.. వాటిని తీర్చే మార్గం కనిపించక గత వారం ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. తండ్రి మరణించినప్పటి నుంచి కొడుకు లింగమూర్తి(36) మానసిక వేదనకు గురవుతున్నాడు. తండ్రి లేని లోటు తాను భరించలేనని గురువారం ఒక్కసారిగా కుప్పకూలి ప్రాణాలు కోల్పోయాడు. వారం రోజుల వ్యవధిలో తండ్రీకొడుకుల మృతితో ఆ కుటుంబం రోడ్డున పడింది. మృతుడికి తల్లి రేణ, భార్య కవిత, కూతురు అశ్విత, కొడుకు వంశీ ఉన్నారు.
రోడ్డు ప్రమాదంలో ఒకరికి గాయాలు
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): ఎల్లారెడ్డిపేట మండలకేంద్రం శివారులో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. పరిస్థితి విషమంగా ఉండడంతో సిరిసిల్ల ఏరియా ఆసుపత్రికి తరలించారు. రాచర్లగొల్లపల్లి నుంచి ఎల్లారెడ్డిపేటకు ద్విచక్ర వాహనంపై వస్తున్న అక్కపల్లికి చెందిన రాజును ఎల్లారెడ్డిపేట నుంచి గొల్లపల్లికి వెళ్లున్న ఆటో ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో గాయపడ్డ రాజును స్థానికులు 108 వాహనంలో సిరిసిల్ల ఏరియా ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.
పోస్టర్పై పేపర్ అతికించిన సిబ్బంది
రాయికల్(జగిత్యాల): పట్టణంలోని ప్రధానమంత్రి భారతీయ జన ఔషది కేంద్రం వద్ద ప్రధాని మోడీ ఉన్న పోస్టర్పై గురువారం మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ సభ్యులు పేపర్ అతికించారు. ఎన్నికల కోడ్ పూర్తయ్యేంతవరకు పోస్టర్ల అతికించవద్దని ఆదేశించారు.