ఆడుకుంటూనే ప్రాణాలు విడిచాడు | Sakshi
Sakshi News home page

ఆడుకుంటూనే ప్రాణాలు విడిచాడు

Published Tue, Dec 19 2023 1:20 AM

బాలుడి మృతదేహం - Sakshi

ధర్మపురి: ఆడుకుంటూనే ఓ బాలుడు ప్రాణాలు విడిచిన ఘటన ధర్మపురి మండలం నేరెళ్లలో విషాదం నింపింది. స్థానికుల కథనం ప్రకారం.. నేరెళ్ల గ్రామానికి చెందిన తోకల నరేశ్‌, నర్మద దంపతులు. వీరికి ఇద్దరు కుమారులు నవదీప్‌ (8), మూడు నెలల బాబు ఉన్నాడు. కుటుంబాన్ని పోషించుకునేందుకు నరేశ్‌ ఆర్నెళ్ల క్రితం దుబాయ్‌ వెళ్లాడు. నర్మద డెలివరీ అయినప్పటి నుంచి బుగ్గారం మండలం వెల్గొండలోని పుట్టింట్లో ఉంటోంది. పెద్ద కుమారుడు నవదీప్‌ (8) నేరెళ్లలోని ఓ ప్రైవేట్‌ పాఠశాలలో రెండోతరగతి చదువుతున్నాడు. రెండు నెలలుగా వెల్గొండ నుంచే పాఠశాలకు వచ్చిపోతున్నాడు. వారంరోజులుగా నవదీప్‌ జ్వరంతో బాధపడుతున్నాడు. చిన్నపాటి జ్వరమని భావించిన తల్లి నర్మద ఆస్పత్రికి తీసుకెళ్లి మందులు తెచ్చి వేస్తోంది. కొద్దిరోజులుగా పాఠశాలకు వెళ్లకుండా స్నేహితులతో కలిసి ఆడుకుంటూ ఉంటున్నాడు. ఎప్పటిలాగే ఆదివారం స్నేహితులతో ఆడుకుంటుండగా కింద పడిపోయాడు. వెంటనే కుటుంబ సభ్యులు బాలుడిని ఆస్పత్రికి తరలించేలోపే మృతిచెందాడు. బాలుడి శవాన్ని సోమవారం నేరెళ్లకు తీసుకొచ్చారు.

పుట్టెడు దుఃఖంతో ఇంటికి..

కొడుకు మరణవార్త తెలుసుకున్న తండ్రి నరేశ్‌ దుబాయ్‌ నుంచి సోమవారం స్వగ్రామానికి చేరాడు. కొడుకు విగతజీవిగా మారడంతో గుండెలవిసేలా రోధించాడు. ప్రతిరోజూ ఫోన్లో ముద్దుముద్దుగా మాట్లాడేటోనివి.. ఇప్పుడు ఎవరితో మాట్లాడాలి బిడ్డా.. అంటూ తల్లిదండ్రులు రోధించిన తీరు స్థానికులను కలచివేసింది.

అనారోగ్యంతో బాలుడి దుర్మరణం

బతుకుదెరువు కోసం విదేశాలకు తండ్రి

కొడుకు మరణంతో స్వగ్రామానికి

Advertisement
Advertisement