వంశీ చేతికే పెద్దపల్లి టికెట్‌.. | Sakshi
Sakshi News home page

వంశీ చేతికే పెద్దపల్లి టికెట్‌..

Published Fri, Mar 22 2024 9:20 AM

- - Sakshi

కాంగ్రెస్‌ లోక్‌సభ అభ్యర్థుల మూడో జాబితా విడుదల

కరీంనగర్‌ నుంచి ప్రవీణ్‌రెడ్డి పేరు దాదాపు ఖరారు!

కరీంనగర్: తెలంగాణ లోక్‌సభ స్థానాల్లో పోటీచేసేందుకు ఐదుగురు పేర్లతో కూడిన మూడో జాబితాను కాంగ్రెస్‌ అధిష్టానం గురువారం ప్రకటించింది. ఇందులో పెద్దపల్లి(ఎస్సీ) నుంచి మాజీ ఎంపీ, చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్‌ కుమారుడు గడ్డం వంశీకు కాంగ్రెస్‌ కేంద్ర ఎన్నికల సంఘం(సీఈసీ) ఆమోదముద్ర వేసింది. కరీంనగర్‌ పార్లమెంట్‌ నుంచి ప్రవీణ్‌రెడ్డి పేరు దాదాపుగా ఖరారైనట్లు సమాచారం. వెలిశాల రాజేందర్‌రావు సహా మరికొందరు నేతలు కరీంనగర్‌ టికెకోసం భారీగా ప్రయత్నాలు చేస్తుండడంతో మరోజాబితాలో ప్రకటించే అవకాశాలు ఉన్నాయి.

తాత, తండ్రి పోటీచేసిన స్థానం నుంచి..
లోక్‌సభ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా కాంగ్రెస్‌ విశ్వప్రయత్నాలు చేస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో చూపిన జోష్‌తో పార్లమెంట్‌ ఎన్నికల్లో సైతం సత్తా చాటాలని చూస్తోంది. గెలుపు గుర్రాలను బరిలో నిలిపేలా వ్యూహా రచన చేస్తోంది. అందులో భాగంగా పెద్దపల్లి పార్లమెంట్‌ స్థానం నుంచి పోటీచేసి గెలిచిన గడ్డం వెంకటస్వామి, మాజీ ఎంపీ వివేక్‌ కుటుంబానికి అధిష్టానం టికెట్‌ ఖరారు చేసింది.

స్థానిక మంత్రి, ఎమ్మెల్యేలు వ్యతిరేకిస్తున్నా బీజేపీ నుంచి కాంగ్రెస్‌లోకి మారినప్పుడు ఇచ్చిన హామీ మేరకు సీఎం రేవంత్‌రెడ్డి గడ్డం వంశీకి టికెట్‌ కేటాయించేట్లు చేసి మాట నిలుపుకున్నారు. ఇప్పటికే పెద్దపల్లి, కరీంనగర్‌ స్థానాలకు బీజేపీ నుంచి గోమాస శ్రీనివాస్‌, బండిసంజయ్‌, బీఆర్‌ఎస్‌ నుంచి కొప్పుల ఈశ్వర్‌, బోయినపల్లి వినోద్‌కుమార్‌ పేర్లు ఖరారు చేశాయి. కరీంనగర్‌ నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీచేసే అభ్యర్థి తేలితే ఉమ్మడి జిల్లాలోని రాజకీయం మరింత వేడెక్కనుంది.

బయోడేటా..
పేరు: గడ్డం వంశీకృష్ణ
భార్య: రోష్ని, ఇద్దరు పిల్లలు
చదువు: బ్యాచిలర్‌ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌ (యూఎస్‌లోని పర్డ్యూ విశ్వవిద్యాలయం నుంచి 2010లో)
వృత్తి: విశాఖ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌లో జాయింట్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ గడ్డం వంశీకృష్ణ

Advertisement
Advertisement