మైసూరు: చామరాజనగర జిల్లాలోని హనూరు తాలూకాలో ప్రఖ్యాతి చెందిన మలెమహాదేశ్వర కొండ పైన వెలసిన మహదేశ్వర ఆలయానికి ఏటా లక్షలాది మంది భక్తులు వస్తుంటారు. రాష్ట్రంలో ప్రముఖ శైవ క్షేత్రాల్లో ఒకటిగా పూజలందుకుంటోంది. ఈ నేపథ్యంలో కొండపైన మలెమహాదేస్వర స్వామి వారి 108 అడుగుల ఎత్తైన విగ్రహం నిర్మాణం పూర్తి చేసుకుంది. కొండ మీద దీపదగిరి ఒడ్డుపై పులి పైన కూర్చొని ఉన్న మలె మహాదేశ్వర స్వామి సుందరమైన విగ్రహాన్ని మార్చి 18వ తేదీన సీఎం బసవరాజు బొమ్మై ప్రారంభిస్తారు. కొండ కింద ఏ వైపు నుంచి చూసినా విగ్రహం కనిపించడం ప్రత్యేకం.
గతంలో ప్రతిపాదనలు
మలెమహాదేశ్వరకొండ పుణ్యక్షేత్రమే కాదు, మంచి పర్యాటక ప్రాంతం కూడా. ఇక్కడకు పర్యాటకులు, ట్రెక్కర్లు తరలివస్తుంటారు. కొండపైన స్వామివారి విగ్రహం, కింది భాగంలో మలె మహదేశ్వర మ్యూజియం నిర్మాణం చేయాలని 2016లో చామరాజనగర జిల్లా ఇన్చార్జ్ మంత్రి హెచ్ఎస్.మహాదేవ ప్రసాద్ నిర్ణయించి ఇందుకోసం సుమారు రూ. 20 కోట్లను కేటాయించారు.