కోలారు: కేజీఎఫ్ తాలూకా ఏ మొతకపల్లి గ్రామంలో మద్యం దుకాణం ఏర్పాటుకు అనుతి ఇస్తే ప్రతిఘటన నిర్వహిస్తామని అంబేడ్కర్ సేవా సంఘం సంస్థాపక రాష్ట్ర అధ్యక్షుడు మంజునాథ్ హెచ్చరించారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. గ్రామంలో పేద దళితులు, కూలీలుపెద్ద సంఖ్యలో నివాసం ఉంటున్నారన్నారు. ఈక్రమంలో అక్కడ మద్యం షాపు కోసం కొందరు ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. మద్యం దుకాణం ఏర్పాటుకు అనుమతి ఇస్తే కార్మికులు మద్యానికి బానిసలై కుటుంబాలను వీధి పాలు చేసుకుంటారన్నారు. కార్మికులు, కూలీల హితవును దృష్టిలో ఉంచుకొని మద్యం దుకాణానికి అనుమతి ఇవ్వరాదన్నారు.
అభివృద్ధి చేశాననే తృప్తి ఉంది
శ్రీనివాసపురం: శ్రీనివాసపురం నియోజకవర్గ ప్రజల రుణం తీర్చుకునేందుకు ప్రామాణిక ప్రయత్నం చేస్తానని ఎమ్మెల్యే కేఆర్ రమేష్కుమార్ తెలిపారు. వెనుకబడిన వర్గాల శాఖ ఆధ్వర్యంలో తాలూకాలోని అణ్ణిహళ్లి గ్రామంలో రూ.21 లక్షలతో సముదాయ భవన నిర్మాణ పనులకు శనివారం ఆయన శ్రీకారం చుట్టారు. అనంతరం మాట్లాడుతూ అత్యధిక సంఖ్యలో పేదలకు గృహ నిర్మాణం చేపట్టిన ఘనత నియోజకవర్గానికి దక్కుతుందన్నారు. నియోజకవర్గ అభివృద్ధికి శ్రమించాననే తృప్తి ఉందన్నారు. కోచిముల్ మాజీ అధ్యక్షుడు బ్యాటప్ప, జిల్లా సహకార యూనియన్ డైరెక్టర్ అణ్ణిహళ్లి నాగరాజ్, శ్యానుభోగనహళ్లి మునివెంకటరెడ్డి పాల్గొన్నారు.
బీజేపీలో చేరిక
మాలూరు : తాలూకాలోని వప్పచ్చహళ్లి గ్రామంలో 50 మందికి పైగా యువకులు శనివారం బీజేపీలో చేరారు. వీరికి బీజేపీ లబ్ధిదారుల సమితి సభ్యుడు హూడి విజయకుమార్ కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. జిల్లా పంచాయతీ మాజీ ఉపాధ్యక్షుడు పి.నారాయణస్వామి, తాలూకా మాజీ అధ్యక్షుడు బీఆర్ వెంకటేష్, రాష్ట్ర సమితి సభ్యుడు హనుమప్ప పాల్గొన్నారు.