శ్రీరంగపట్టణ: నీటికుంటలో పడి ఇద్దరు బాలికలు మృతి చెందిన ఘటన శ్రీరంగపట్టణ తాలూకా కాళేనహళ్లి శెడ్డు గ్రామంలో జరిగింది. మృతులను గ్రామానికి చెందిన లీనామతి (19), మీనా (17)లుగా గుర్తించారు. శనివారం ఉదయం నలుగురు బాలికలు బట్టలు ఉతికేందుకు కల్లుకోరెలోని నీటికుంటకు వచ్చారు. బట్టలు ఉతుకుతుండగా వీరితో వచ్చిన ఆరేళ్ల చిన్నారి నీటిలో పడిపోయింది. కాపాడాలని నలుగురు నీటిలోకి దిగారు. ఈ క్రమంలో ఇద్దరు బాలికలు నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయారు. పక్కనే ఉన్న రాళ్ల క్వారీ కార్మికులు హుటాహుటిన అక్కడికి చేరుకుని చిన్నారిని, మునిగిపోతున్న ఇద్దరు బాలికలను రక్షించారు. శ్రీరంగపట్టణ గ్రామీణ పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది.
బలరాముడికి అస్వస్థత
● వారం రోజులుగా ఆహారం
మానేసిన దసరా గజరాజు
మైసూరు: ప్రపంచ ఖ్యాతి గాంచిన మైసూరు దసరా వేడుకల్లో 15 సార్లు అంబారినీ మోసిన బలరామ (67) తీవ్ర అస్వస్థతకు గురైంది. మైసూరు జిల్లా హణసూరు తాలూకా నాగరహోళె జాతీయ ఉద్యానవనంలో బీమనకట్టె ఏనుగుల శిబిరంలో ఉన్న బలరామ వారం రోజులుగా ఆహారం తీసుకోలేదు. ఎండోస్కోపి చేసిన వైద్య బృందం ఏనుగు గొంతులో పుండు ఉన్నట్లు గమనించారు. దీని వల్ల ఆహారం తీసుకోవడం కష్టంగా మారింది. దీంతో గజరాజుకు ద్రవ పదార్థాలను అందజేస్తున్నారు. ప్రత్యేక వైద్యం బృందం దగ్గరుంచి చికిత్సలు చేస్తున్నారు. బలరామ అస్వస్థతకు గురి కావడంతో అభిమానుల్లో ఆందోళన నెలకొంది.