● ఢిల్లీ పెద్దలు ధైర్యం చెప్పారు: బొమ్మై
శివాజీనగర: విధానసభ ఎన్నికల్లో బీజేపీలో విజేతలు, ఓడినవారితో నియోజకవర్గాల వారీగా రెండు విడతల్లో ఆత్మపరిశీలన సభలు జరపనున్నట్లు తాత్కాలిక సీఎం బసవరాజ బొమ్మై తెలిపారు. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ రాష్ట్రాధ్యక్షుడు, కార్యవర్గ సభ్యులు, ఎమ్మెల్యేలతో కలసి ఆదివారం ఆయన సమావేశం జరిపారు. తరువాత విలేకరులతో మాట్లాడారు. తమ పార్టీ కార్యక్రమాలకు విశ్రాంతి ఉండదు, ఎన్నికల తరువాత కూడా ప్రజల వద్దకు వెళతాం. ఓటమిని చాలా వినయంతో స్వీకరించామని చెప్పారు. ఓడిపోవడానికి కారణాలపై సమీక్షలు నిర్వహిస్తామన్నారు. పార్టీ రాష్ట్రాధ్యక్షుని రాజీనామా అంశం, అలాగే బీజేపీ పక్ష నేత అంశం చర్చలో లేదన్నారు. ఢిల్లీ నుంచి పార్టీ పెద్దలు ఫోన్ చేసి ధైర్యం చెప్పారని తెలిపారు.
అడ్వొకేట్ జనరల్ రాజీనామా
శివాజీనగర: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మెజారిటీ రావడంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే ప్రక్రియలో ఉంది. ఈ నేపథ్యంలోనే ఆదివారం కర్ణాటక అడ్వొకేట్ జనరల్ స్థానానికి ప్రభులింగ నావదగి రాజీనామా చేశారు. ఆదివారం గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్ను రాజభవన్లో భేటీ అయిన ప్రభులింగ నావదగి రాజీనామా పత్రా న్ని అందించారు.