బనశంకరి: వర్షాలతో తలెత్తే ప్రమాదాలను సమర్థంగా ఎదుర్కోవాలని ముఖ్యమంత్రి సిద్దరామయ్య, డిప్యూటీ సీఎం డీకే.శివకుమార్లు జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. బెంగళూరులో అండర్పాస్ నీటిలో కారు మునిగి మహిళా టెక్కీ మరణించడం, గాలీవానకు భారీ విధ్వంసం నేపథ్యంలో మంగళవారం విధానసౌధలో అన్ని జిల్లాల కలెక్టర్లు, జిల్లాపంచాయతీ సీఈఓలతో సమావేశం నిర్వహించారు. ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కోవడానికి తీసుకోవలసిన ముందస్తు చర్యలు పట్ల అధికారులకు సూచనలు చేశారు. జిల్లాస్థాయిలో ప్రకృతి వైపరీత్యాలు, నిర్వహణ కోసం జిల్లా కలెక్టర్ల ఖాతాలో నిధులు ఉన్నాయని, పరిష్కార చర్యలను చేపట్టాలని సూచించారు.
వడగండ్లతో కూడిన వర్షంతో కొన్ని జిల్లాల్లో మామిడి, దానిమ్మ , అరటి తోటలు భారీగా దెబ్బతిన్నాయి. పంటనష్టం గురించి అత్యవసర నివేదిక అందించాలని సీఎం ఆదేశించారు.
గ్యారంటీ పథకాలపై
అలాగే కాంగ్రెస్ పార్టీ ఐదు గ్యారంటీ పథకాలైన గృహ లక్ష్మీ, గృహ జ్యోతి, అన్నభాగ్య, యువనిధి, శక్తి యోజన పథకాల రూపురేఖలపై అధికారులపై చర్చించారు. గృహ జ్యోతి పథకం కింద 200 యూనిట్ల ఉచిత విద్యుత్ను ఇవ్వడానికి అర్హుల ఎంపికపై వివరాలు సేకరించాలని సూచించారు.
జిల్లా యంత్రాంగాలకు సీఎం సూచన