రాయచూరు రూరల్: దివంగత మాజీ ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రూ దేశానికి చేసిన సేవలు అమోఘమని సీనియర్ కాంగ్రెస్ నేత పారసమల్ సుఖాణి పేర్కొన్నారు. ఆయన శనివారం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నెహ్రూ వర్ధంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాల వేసి మాట్లాడారు. అత్యంత ప్రభావశీల ప్రధానమంత్రిగా దేశంలో పంచశీల సూత్రాలను అమలు చేసిన వ్యక్తిగా కొనియాడారు. సురేష్, జయంతిరావ్, జాగీర్దార్, అబ్దుల్ కరీం, భీమనగౌడ, పవన్, రాణి, ప్రేమలత, మాలా, శశికళ, రాజశేఖర్, నిర్మల, రజియాలున్నారు.
జపాన్ పర్యటనకు
మండ్య బాలలు
మండ్య: తాలూకాలోని సిద్దయ్యనకొప్పలులోని ఓ పాఠశాలకు చెందిన విద్యార్థులు జపాన్లో నిర్వహించిన విద్యార్థుల వినియమ కార్యక్రమంలో పాల్గొన్నారు. 7వ తరగతి చదువుతున్న విద్యార్థులు అయిన అస్విన్, 8వ తరగతి చదివే ధన్య జి. గౌడ. సాంస్కృతిక పర్యటన కింద జపాన్కు వెళ్లారు. ఏప్రిల్ 23న వెళ్లిన వీరు జూన్ 2న తిరిగి వస్తారు. జపాన్ ప్రజలకు కన్నడ సంస్కృతీ సంప్రదాయాలు, ఆహారం, ఆచార విచారాలు తదితరాలను వివరిస్తారు. అలాగే జపాన్ సంస్కృతి గురించి తెలుసుకుంటారు. పలు నగరాలలో పర్యటించి విశేషాలు తెలుసుకుంటారు.
తంగడిగికి మంత్రి పదవిపై సంబరాలు
గంగావతి: కనకగిరి ఎమ్మెల్యే శివరాజ్ తంగడిగి మంత్రి పదవిని చేపట్టిన సందర్భంగా నియోజకవర్గంలోని నాయకులు, కార్యకర్తలు ఆనందోత్సవాలను వ్యక్తం చేస్తూ స్వీట్లను పంచుకొని సంబరాల్లో మునిగి తేలారు. సిద్దాపుర, కారటగి, కనకగిరి తదితర పలు ప్రాంతాల్లో ఆయనకు మంత్రి పదవి లభించడంపై కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పార్టీ కనకగిరి విభాగం అధ్యక్షులు రమేష్ నాయక్ మాట్లాడుతూ శివరాజ్ తంగడిగికి పార్టీ మంత్రి పదవిని అప్పగించి సముచిత న్యాయం చేకూర్చిందన్నారు. వెనుకబడిన ప్రాంత అభివృద్ధి కోసం శివరాజ్ తంగడిగి ఎంతో శ్రమించారని, ఇకపై కూడా ఆయన మరింత అభివృద్ధికి పాటుపడతారని ఆశాభావం ప్రకటించారు.
కనకదుర్గమ్మకు
1001 టెంకాయలు
బళ్లారిఅర్బన్: బెంగళూరులో శనివారం సిద్దరామయ్య కేబినెట్లో గ్రామీణ ఎమ్మెల్యే బీ.నాగేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడంతో నగరంలోని కనకదుర్గమ్మ దేవస్థానం ముందు కాంగ్రెస్ యువ నాయకుడు ఎంజీ.కనక నేతృత్వంలో అభిమానులు 1001 టెంకాయలను కొట్టి పూజలు నిర్వహించారు. నాగేంద్రకు మంత్రి పదవి దక్కడంపై హర్షం వ్యక్తం చేస్తూ అభిమానులతో పార్టీ కార్యకర్తలు బాణసంచాను పేల్చి స్వీట్లను పంచి పెట్టారు. ఈసందర్భంగా అభిమానులు అనిల్కుమార్, మల్లి, అరుణ్, నూర్వలీ, అభి, నిఖిల్, వినోద్, రామలింగ, పవన్, భీమా, అశోక్ తదితరులు పాల్గొన్నారు.
గుర్తు తెలియని వ్యక్తి
మృతదేహం లభ్యం
మాలూరు: పట్టణంలోని బస్టాండు వద్ద అంబేడ్కర్ పార్కు ప్రాంగణంలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. మృతుడు సుమారు 50 ఏళ్ల వయసు కలిగి ఉన్నాడని, మృతుడి వివరాలు తెలియరాలేదని పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని కోలారు ఎస్ఎన్ఆర్ జిల్లా ఆస్పత్రిలో భద్రపరిచారని, బంధువులు ఎవరైనా ఉంటే మాలూరు పోలీస్ స్టేషన్లో సంప్రదించాలని పోలీస్ ఇన్స్పెక్టర్ చంద్రాధర్ తెలిపారు.