బొమ్మనహాళ్: హొసపేటె వద్దనున్న తెలుగు, కన్నడ రాష్ట్రాల వరదాయిని తుంగభద్ర జలాశయంలో నీటి నిల్వ బాగా క్షీణించింది. ఇప్పుడు పూర్తిస్థాయి నీటిమట్టంతో తొణికిసలాడాల్సిన డ్యాంలో సగం నీరే ఉన్నాయి. ఆదివారం నీటి నిల్వ 55.737 టీఎంసీలకు తగ్గింది. నెల రోజుల క్రితం 79 టీఎంసీల నీరు ఉండేది. జలాశయం ఎగువ భాగంలో వర్షాలు తగ్గడం, ఎండల కారణంగా నీటి లభ్యత తగ్గిపోయింది. కాలువలకు నీటిని వదులుతుండడంతో జలాశయంలో మూడు రోజులకు 2 టీఎంసీల చొప్పున నీరు ఖాళీ అవుతోంది. డ్యాంలో ఆదివారం ఇన్ఫ్లో 1,220 క్యూసెక్కులు మాత్రమే ఉండగా అవుట్ఫ్లో 9,791 క్యూసెక్కులుంది.
గతేడాది 104 టీఎంసీలు
జలాశయం పూర్తి స్ధాయి నీటి మట్టం 1,633 అడుగులు కాగా 1,618 అడుగుల వరకు నీరు నిల్వ ఉంది. 105 టీఎంసీల పూర్తి స్ధాయి మట్టానికి గాను 55 టీఎంసీలకు పరిమితం కావడంతో రైతుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. ఆంధ్రా సరిహద్దుల్లో (105వ కిలోమీటర్ వద్ద) 1,670 క్యూసెక్కులు నీటి ప్రవాహం కొనసాగుతోంది. గతేడాది ఇదే సమయానికి 104 టీఎంసీల నీరు నిల్వతో, 42,089 క్యూసెక్కుల ఇన్ఫ్లో, 55,320 క్యూసెక్కుల అవుట్ ఫ్లోతో జలాశయం కళకళలాడేది.