రాయచూరు రూరల్: రాష్ట్రంలో వేల కోట్ల వక్ఫ్ ఆస్తులు అన్యాక్రాంతమైనట్లు రాష్ట్ర వక్ఫ్ మండలి అధ్యక్షుడు అన్వరబాషా తెలిపారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... వక్ఫ్ ఆస్తుల అతిక్రమణలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పేరు కూడా ఉందని ఆరోపించారు. జిల్లాలో మసీదులు, దర్గా, కబరస్థాన్లను ఆక్రమించిన అంశంపై గత బీజేపీ సర్కార్ సర్వేలో తేలిందన్నారు. కలబుర్గిలో నెల రోజుల క్రితం వంద ఎకరాల వక్ఫ్ భూమిని స్వాధీనం చేసుకున్నామని, రాష్ట్రంలో వక్ఫ్ ఆస్తుల ఆక్రమణలకు సంబంధించి నివేదికను ప్రభుత్వానికి సమర్పించామన్నారు.
బస్సు వెనుక ఢీకొన్న టిప్పర్
రాయదుర్గం: రాయదుర్గం నుంచి బళ్లారి వైపు ప్రయాణికులతో వెళుతున్న ఆర్టీసీ బస్సును డి.హీరేహాళ్ మండలం పులకుర్తి గేట్ వద్ద్ద ఓవర్టేక్ చేయబోయిన టిప్పర్ వెనుక భాగాన ఢీకొట్టింది. ఈ ఘటనలో బస్సు అద్దాలు పగిలిపోయాయి, అదృష్టవశాత్తు 30 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. బస్సు డ్రైవర్ స్వల్పంగా గాయపడడంతో బళ్లారి ఆస్పత్రికి తరలించారు. టిప్పర్ ముందు భాగం అణిగిపోయింది. జరిగిన సంఘటన చూస్తే పెద్ద ప్రమాదం తప్పిందని అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కంకరలోడ్లతో వెళ్లే టిప్పర్ల వేగానికి తరచూ ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని, అధికారులు నివారణ చర్యలు చేపట్టాలని స్థానికులు విజ్ఞప్తి చేశారు.