సాక్షి బళ్లారి: బీదర్ జిల్లాలో తరచూ భూ ప్రకంపనలు వస్తుండడంతో ప్రజల్లో గుబులు నెలకొంది. ఎప్పుడు పెను విపత్తు సంభవిస్తుందోనని కంటి మీద కునుకు లేకుండా గడుపుతున్నారు. బుధవారం జిల్లాలో మళ్లీ భూమి కంపించింది. హుమ్నాబాద్ తాలూకా వడ్డరకెరె, మధురగామ్ తదితర గ్రామాల్లో భూకంపం రిక్టర్ స్కేలుపై 2.4 పాయింట్లుగా నమోదైనట్లు అధికారులు తెలిపారు. గత నెలలో, అంతకముందు కూడా ఇలాగే తక్కువస్థాయి ప్రకంపనలు వచ్చాయి. గ్రామాల్లో ప్రజలు భయాందోళన వ్యక్తం చేశారు.
ఏఎస్ఐ ఆత్మహత్య
హుబ్లీ: ధార్వాడ జిల్లాలోని కుందగోళ తాలూకా గుడగేరి పోలీస్ స్టేషన్ ఏఎస్ఐ ఆత్మహత్య చేసుకున్న ఘటన బుధవారం వెలుగు చూసింది. వివరాలు.. గుడగేరి ఏఎస్ఐ బసవరాజ్ శాంతవీరప్ప (54) రాత్రి డ్యూటీ ముగించుకొని క్వార్టర్స్లోని నివాసానికి దగ్గరలో ఆలయం వద్ద పడుకున్నాడు. కుటుంబ సభ్యులు భోజనం చేయడానికి నిద్రలేపగా ఆయన లేవలేదు. వెంటనే వారు లక్ష్మేశ్వర ఆస్పత్రికి ఆయనను తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే చనిపోయాడని తెలిపారు. పోస్టుమార్టం నివేదికలో పురుగులమందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లుగా తేలింది. బసవరాజ్ కొంతకాలంగా కాళ్లనొప్పులతో బాధపడేవారు. అనారోగ్యమే ఆయన ఆత్మహత్యకు కారణమని భావిస్తున్నారు. మృతుని స్వస్థలం గదగ్ జిల్లా గజేంద్రగడ సమీపంలోని శాంతగిరి గ్రామం కాగా ఆయనకు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఈ ఘటనపై గుడిగేరి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.