మైసూరు: పోలీసులు వేధింపులకు గురి చేస్తున్నారని ఓ యువకుడు పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు, తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. వివరాలు.. మైసూరు జిల్లాలోని నంజనగూడు తాలూకా నగర్లె గ్రామానికి చెందిన కిరణ్ కుమార్ (23) మృతుడు. గ్రామంలో జరిగిన ఒక చిన్న గొడవ కేసులో కిరణ్ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ జరిపారు.
పోలీసుల వద్ద నుంచి తప్పించుకొని వచ్చిన కిరణ్కుమార్ తాను ఎ తప్పూ చేయకున్నా కూడా పోలీసులు వేధిస్తున్నారని కుటుంబ సభ్యులతో వాపోయాడు. రెండు రోజుల కిందట తాను ఆత్మహత్య చేసుకుంటానని, ఇందుకు పోలీసులే కారణమని వీడియో రికార్డు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఆపై పెట్రోలు పోసుకుని నిప్పంటించుకున్నాడు. తీవ్ర గాయాలు కావడంతో కుటుంబసభ్యలు మైసూరులోని కేఆర్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆరోగ్యం విషమించడంతో మంగళవారం అతడు మరణించాడు. నంజనగూడు పోలీసులు కేసు నమోదు చేశారు.