● మాజీ ఎమ్మెల్యే ఆరోపణలు
దొడ్డబళ్లాపురం: బిడది ఇన్స్పెక్టర్ శంకర్నాయక్పై కొత్తగా మరికొన్ని అవినీతి ఆరోపణలు వినిపిస్తున్నాయి. మాగడి మాజీ ఎమ్మెల్యే మంజు.. ఆయనపై పేకాట,రైస్ పుల్లింగ్ ఆరోపణలు చేశారు. రామనగరలో ఆయన మీడియా సమావేశంలో మాట్లడుతూ ఎఫ్ఐఆర్ నమోదైనప్పటికీ శంకర్ నాయక్ సస్పెండ్ కాకుండా విధుల్లో కొనసాగుతుండడం సిగ్గుచేటన్నారు. శంకర్ నాయక్ నేపథ్యం చూస్తే ఆయన పోలీసు శాఖకే తలవంపు అన్నారు. పనిచేసిన ప్రతి చోటా ఆయనపై అనేక అవినీతి ఆరోపణలు ఉన్నాయన్నారు. కుదూరులో లోక్నాథ్ సింగ్ అనే వంచకునితో కలిసి రైస్పుల్లింగ్ దందా చేశాడన్నారు. దందాలు చేయడానికి ఇతడు ప్రత్యేకంగా ఒక గ్యాంగ్ను నడిపిస్తున్నాడని ఆరోపించారు. రూ.80 లక్షలు ఇచ్చి బిడదికి బదిలీ చేయించుకున్నాడన్నారు. నాగరబావి, రాజరాజేశ్వరినగర తదితర ప్రాంతాల్లో అక్రమ సంపాదనతో స్థలాలు కొనుగోలు చేసాడని, రూ.15 కోట్లతో బంగళా కట్టిస్తున్నాడని అన్నారు. అతన్ని డీజీ, ఐజీ తక్షణం సస్పెండ్ చేయాలని డిమాండు చేశారు.
1.5 కేజీల అంబర్గ్రీస్ స్వాధీనం
బనశంకరి: కోట్లాది రూపాయల విలువచేసే తిమింగలం వాంతి (అంబర్గ్రీస్)ను విక్రయించడానికి ప్రయత్నిస్తున్న ముగ్గురిని శనివారం మంగళూరు సీసీబీ పోలీసులు అరెస్ట్చేశారు. వీరి వద్ద నుంచి రూ.1.57 కోట్ల విలువచేసే 1.575 కేజీల అంబర్గ్రీస్ను స్వాధీనం చేసుకున్నారు. నిందితులు చిక్కమగళూరు విట్లికి చెందిన ప్యారేజాన్ సేట్, బద్రుద్దీన్, తమిళనాడు నాగపట్టణంవాసి రాజేశ్లు. ఈ అంబర్గ్రీస్ రూ.1.57 కోట్ల విలువ చేస్తుందని తెలిపారు.