తుమకూరు: డిసెంబర్ 6వ తేదీ తరువాత ఢిల్లీకి వెళ్లి బీజేపీ పెద్దలను కలిసి మాట్లాడతానని మాజీ మంత్రి సోమన్న తెలిపారు. శనివారం కుటుంబంతో ఆయన తుమకూరు సిద్దగంగా మఠాన్ని సందర్శించి పూజలు చేశారు. తరువాత మీడియాతో మాట్లాడుతూ డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో బీజేపీ నాయకులు బసవనగౌడ పాటిల్ యత్నాల్, అరవింద బెల్ళద్, అరవింద లింబావళి, రమేష్ జార్కిహొళితో కలిసి ఢిల్లీకి వెళ్లి పార్టీ పెద్దలను కలిసి తన అభిప్రాయాలను చెబుతానన్నారు. పార్టీలో ఎవరికీ అసంతృప్తి లేదన్నారు. మఠం ఆవరణలో తాము నిర్మించిన గురుభవనాన్ని డిసెంబరు 6న ప్రారంభిస్తామని, మంత్రులు, ఎమ్మెల్యేలు ఇందులో పాల్గొంటారని చెప్పారు. కాగా, సోమన్న వెంటే ఢిల్లీకి వెళ్లేవారందరూ అసమ్మతి నేతలే. పార్టీ తీరుపై కొంతకాలంగా అసంతృప్తితో ఉన్నారు. వీరంతా కలిసి అసమ్మతి కూటమిగా ఏర్పడినట్లు భావిస్తున్నారు.
సోమణ్ణ ఫోన్ ఎత్తడం లేదు: యడ్డి
బనశంకరి: మాజీమంత్రి వీ.సోమణ్ణకు ఫోన్ చేస్తే తీయడం లేదని, ఏమీ చేయలేమని బీజేపీ మాజీ సీఎం బీఎస్.యడియూరప్ప వాపోయారు. శనివారం ఆయనీ విషయమై స్పందిస్తూ సోమణ్ణను పా ర్టీలో కాపాడుకోవడానికి ప్రయత్నిస్తున్నామని, ఫోన్ చేస్తే స్పందించడం లేదన్నారు. ఆయనతో ఎలాగైనా మాట్లాడి పార్టీలో కొనసాగేలా చూస్తామన్నారు. ఇటీవలి శాసనసభ ఎన్నికల్లో రెండు చోట్ల పోటీచేసి ఓడిపోయిన సోమణ్ణ ఆగ్రహంతో ఉన్నారు.