యశవంతపుర: జీవితంపై విరక్తితో ఓ మహిళ సముద్రంలోకి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన ఉత్తరకన్నడ జిల్లా కుమటాలో జరిగింది. కుమటా తాలూకా సాంతగల్ గ్రామానికి చెందిన నివేదిత నాగరాజ భండారి తన ఇద్దరు మగపిల్లలను తీసుకొని స్కూటీలో సముద్రం వద్దకు వెళ్లింది.
పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకోవాలని భావించింది. అయితే మనస్సు మార్చుకొని ఇద్దరు పిల్లలను కుమటా పిక్ప బస్టాండ్ వద్ద కుర్చోపెట్టి నివేదితా ఒక్కతే తిరిగి సముద్రం వద్దకు వెళ్లింది. మాంగల్యం, కాలి మెట్టెలు, సెల్ఫోన్ స్కూటీలో పెట్టి సముద్రంలోకి దూకింది. లైఫ్గార్డ్ గుర్తించి ఆమెను రక్షించటానికి యత్నించినా అలల కారణంగా సాధ్యం కాలేదు. గాలించగా ఆమె మృతదేహం లభ్యమైంది. కుమాట పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.