మండ్య: కావేరి నీటిని తమిళనాడుకు విడుదల చేయొద్దని డిమాండ్ చేస్తూ మండ్య జిల్లా రైతు హితరక్షణ సమితి నగరంలో చేపట్టిన ధర్నా సోమవారం 91వ రోజుకు చేరింది. ఈ సందర్భంగా కర్ణాటక దళిత సంఘర్ష సమితి సభ్యులు ధర్నా శిబిరం వద్దకు చేరుకొని ఆందోళనకారులకు మద్దతు పలికారు. అనంతరం సభ్యులు శివరాజ మరళిగ, శ్రీనివాస్, శంకర, దేవరాజు, అప్పాజి, మాదేవిలు ధర్నాలో పాల్గొన్నారు.
న్యాయవాదుల ధర్నా
మండ్య: చిక్కమగళూరులో న్యాయవాది ప్రీతంపై పోలీసులు అకారణంగా దాడి చేశారని ఆరోపిస్తూ మండ్యలో న్యాయవాదులు ఉద్యమించారు. సోమవారం స్థానిక న్యాయవాద సంఘం కార్యాలయం వద్దకు చేరుకొని అనంతరం ర్యాలీగా వెళ్లి బెంగూళూరు మైసూరు జాతీయ రహదారిలో రాస్తారోకో నిర్వహించారు. తర్వాత జేసీ సర్కిల్ వద్దకు చేరుకొని ధర్నా నిర్వహిచారు. ఈ సందర్భంగా పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కేవలం హెల్మెట్ పెట్టుకోలేదని న్యాయవాదిపై పోలీసులు దాడి చేయడం దారుణమన్నారు. పోలీసులపై కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
పౌర కార్మికుల సేవలు వెలకట్టలేనివి
బొమ్మనహళ్లి: బెంగళూరు నగర శుభ్రతతో పాటు ప్రజల ఆరోగ్య రక్షణ కోసం నిరంతరం శ్రమించే పౌర కార్మికుల సేవలకు వెలకట్టలేమని బీబీఎంపీ మాజీ కార్పొరేటర్ భాగ్యలక్ష్మి మురళి అన్నారు. ఆరికెరె వార్డులో ఉన్న శాంతినికేతన్ లేఔట్ శ్రీవాసవి ఆలయ ట్రస్టు ఆధ్వర్యంలో పౌర కార్మికులకు సోమవారం ఆమె రగ్గులు అందజేశారు. ఎండ, వాన, చలి అన్న తేడా లేకుండా పారిశుధ్య పనులు చేపట్టే కార్మికులు ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షించారు. బీజేపీ నాయకుడు మురళిధర్, ట్రస్టు సభ్యులు పాల్గొన్నారు.
కారుతో ఢీకొట్టి డ్రైవర్పై దాడి
యశవంతపుర: డ్రైవర్పై కొందరు వ్యక్తులు కారుతో ఢీకొట్టి దాడి చేసిన ఘటన బెంగళూరులో జరిగింది. ఇందుకు సంబంధించి ఓ వ్యక్తి బెంగలూరు ట్రాఫిక్ పోలీసులకు ఎక్స్లో పోస్టు చేశారు. నవంబర్ 29న ఉదయం 8:30 గంటలకు ఈ ఘటన జరిగింది. హెబ్బాళ పై వంతెనపై ఓ డ్రైవర్ కారును నిలిపి అక్కడే నిలబడ్డాడు. ఇదే మార్గంలో వచ్చిన ఇన్నోవా కారు అతన్ని ఢీకొంది. అనంతరం అదేకారనుంచి కొందరు కిందకు దిగి డ్రైవర్పై దాడి చేశారు. ఈ దృశ్యాలు కారు డ్యాష్ కేమరాలో రికార్డ్ అయ్యాయి.
పనులు కల్పించలేదని ధర్నా
చింతామణి: తాలుకాలోని చిన్నసంద్ర పంచాయతీ అధికారులు సక్రమంగా విధులు నిర్వహించలేదని ఆరోపిస్తూ ఆ పంచాయతీ పరిధిలోని నల్లగుట్లపల్లి గ్రామస్తులు సోమవారం పంచాయతీ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు ఆందోళనకారులు మాట్లాడుతూ నరేగా పనులు కల్పించకుండా పీడీఓ గీత, సిబ్బంది నిర్లక్ష్యంగా వహిస్తున్నారని ఆరోపించారు. కాగా విషయం తెలుసుకున్న ఈఓ ఆనంద గ్రామానికి చేరుకొని గ్రామస్తులతో చర్చించారు. సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో గ్రామస్తులు శాంతించారు.
రెండు రోజుల పాటు వానలు
యశవంతపుర: మిచాంగ్ తుపాన్తో వచ్చే రెండు రోజుల పాటు రాష్ట్రంలో భారీ వానలు పడే అవకాశం ఉన్నట్లు వాతావారణశాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. రాజధాని బెంగళూరులో చలి పెరిగింది. ఆంధ్ర, తమిళనాడులో భారీ వానలు కురుస్తున్న కారణంగా కర్ణాటకలో హై అలర్ట్ను ప్రకటించారు. చలిగాలులు వేగంతో వీస్తున్నాయి.