రైలు టాయిలెట్‌లో గన్‌ మర్చిపోయాడా? | Sakshi
Sakshi News home page

రైలు టాయిలెట్‌లో గన్‌ మర్చిపోయాడా?

Published Tue, Dec 19 2023 12:44 AM

Police constable left his gun in the train toilet - Sakshi

కర్ణాటక: రైలుబోగీలోని ఓ మరుగుదొడ్డిలో పిస్తోల్‌ను మండ్య రైల్వే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో మండ్య జిల్లా డీఆర్‌ కానిస్టేబుల్‌ నాగరాజును సస్పెండ్‌ చేశారు. వివరాలు...మండ్య జిల్లాలో డీఆర్‌ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న నాగరాజు అంగరక్షకుడిగా విధులు నిర్వహిస్తున్నాడు. అతను సోమవారం బెంగళూరు నుంచి మండ్యకు కాచిగూడ రైలులో ప్రయాణించాడు. ఆ సమయంలో మరుగుదొడ్డిలోకి వెళ్లిన నాగరాజు తన పిస్తోల్‌ తీసి వాష్‌బేసిన్‌పై పెట్టి మరచిపోయి బయటకు వచ్చేశాడు.

కొద్ది సేపు అనంతరం ఓ ప్రయాణికుడు బాత్‌రూమ్‌కు వెళ్లి అక్కడ పిస్తోల్‌ ఉండటాన్ని గమనించి తోటి ప్రయాణికులకు చెప్పడంతో క్షణాల్లో అందరికి తెలిసిపోయింది. అంతలోనే రైలు మండ్య నగరం చేరుకుంది. సమాచారం తెలుసుకున్న రైల్వే పోలీసులు పిస్తోల్‌ను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం బెంగళూరు రైల్వే కంట్రోల్‌ రూమ్‌కు సమాచారం ఇచ్చారు. వారి ద్వారా సమాచారం తెలుసుకున్న పోలీసులు విచారణ చేపట్టి ఆ పిస్తోల్‌ మండ్య జిల్లాలో అదనపు బలగాల్లో పనిచేస్తున్న నాగరాజుదిగా గుర్తించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన నాగరాజును సస్పెండ్‌ చేస్తూ జిల్లా ఎస్పీ యతీశ్‌ ఆదేశాలు జారీ చేశారు.

Advertisement
Advertisement