ఖమ్మంవ్యవసాయం: అకాల వర్షాలకు జిల్లాలో జరిగిన పంట నష్టంపై అధికారులు క్షేత్ర స్థాయిలో చేపట్టిన సర్వే గురువారంతో ముగిసింది. ఈమేరకు వివరాలు ఆన్లైన్ నమోదు చేసే ప్రక్రియ కొనసాగుతోంది. గతనెల 17 నుంచి 20వ తేదీ వరకు కురిసిన అకాల వర్షాలతో జిల్లాలోని 19,732మంది రైతులకు చెందిన 31,038 ఎకరాల్లో మొక్కజొన్న, పెసర, ఇతర పంటలకు నష్టం వాటిల్లినట్లు ప్రాథమికంగా అంచనా వేశారు. పంట నష్టపోయిన వారికి ఎకరాకు రూ.10వేల చొప్పున పరిహారం చెల్లించనున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించిన నేపథ్యాన అధికారులు సర్వే చేపట్టారు. సర్వేలో తేల్చిన వివరాల ఆధారంగా ఆన్లైన్లో నమో దు చేస్తున్నారు. ఈ సర్వేల ఆధారంగా జిల్లాలో మొత్తంగా 18వేల నుంచి 20 వేల ఎకరాల్లో పంటలకు నష్టం జరిగినట్లుగా గుర్తించారని తెలుస్తోంది. రైతుల పూర్తి వివరాలు, బ్యాంక్ అకౌంట్ నంబర్లను ఆన్లైన్లో చేసే ప్రక్రియ ఒకటి, రెండు రోజుల్లో పూర్తయ్యే అవకాశం ఉందని సమాచారం.
యూపీహెచ్సీలో
ఎన్క్వాస్ బృందం
ఖమ్మం వైద్యవిభాగం: ఖమ్మం మామిళ్లగూడెంలోని అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ను గురువారం ఎన్క్వాస్ బృందం పరిశీలించింది. ఒడిశాకు చెందిన ప్రొఫెసర్ రాజ్యలక్ష్మి, మహారాష్ట్రకు చెందిన ప్రొఫెసర్ ప్రశాంత్ ఆధ్వర్యాన వివిధ విభాగాల్లో సేవలను తనిఖీ చేశారు. ఈసందర్భంగా డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ రాంబాబు వారికి వైద్యసేవలపై వివరించారు. జిల్లా క్వాలిటీ మేనేజర్ ఉపేందర్, ఆస్పత్రి సిబ్బంది పాల్గొన్నారు.