ఖమ్మం స్పోర్ట్స్: గజ్వేల్లో ఇటీవల జరిగిన రాష్ట్రస్థాయి నెట్బాల్ పోటీల్లో ఖమ్మంలోని ఆర్జేసీ కళాశాల విద్యార్థి జి.వసంత ప్రతిభ కనబర్చి హర్యానాలో జరగనున్న జాతీయ స్థాయి నెట్బాల్ పోటీలకు ఎంపికై ంది. డిసెంబర్లో జరిగే పోటీల్లో ఆమె తెలంగాణ జట్టు నుంచి ప్రాతి నిధ్యం వహించనుంది. ఈసందర్భంగా వసంతను ఆర్జేసీ విద్యాసంస్థల చైర్మన్ గుండాల కృష్ణ, డిగ్రీ, జూనియర్ కళాశాలల ప్రిన్సిపాళ్లు ఏ.లింగయ్య, ఏ.లక్ష్మీపతి, ఇన్చార్జి ఉపేందర్ మంగళవారం అభినందించారు.
వీవీసీ గ్రూప్ ఉద్యోగుల రక్తదానం
ఖమ్మంఅర్బన్: వీవీసీ గ్రూపుల అధినేత దివంగత వంకాయలపాటి రమణప్రసాద్ జయంతిని ఖమ్మం మమత రోడ్డులోని వీవీసీ గార్డెన్స్లో మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా సంస్థ ఉద్యోగులు 110 మంది రక్తదానం చేయగా, మంత్రి పువ్వాడ అజయ్కుమార్, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తదితరులు పాల్గొని రమణప్రసాద్ చిత్రపటం వద్ద నివాళులర్పించడంతో పాటు ఆయన చేపట్టిన సేవా కార్యక్రమాలను గుర్తుచేశారు. ఈకార్యక్రమంలో వీవీసీ, వీఆర్ఏ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ వంకాయలపాటి రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ అత్యవసర సమయంలో రక్తం దొరకక ఇబ్బంది పడేవారికి అండగా నిలిచేందుకు రక్తదాన శిబిరం ఏర్పాటుచేశామని తెలిపారు. ఆతర్వాత గ్రూప్లో 30ఏళ్ల సర్వీస్ పూర్తిచేసుకున్న ఉద్యోగులను ఎండీతో పాటు డైరెక్టర్లు వీరేన్చౌదరి, వికాస్చౌదరి, ఆదిత్య సన్మానించారు. ఈ కార్యక్రమంలో సంస్థ చైర్మన్ ద్రౌపతి, ఉద్యోగులు పాల్గొన్నారు.
బ్యాంకు మేనేజర్ ఆత్మహత్య
విధుల్లో ఒత్తిడే కారణమని సూసైడ్నోట్
ఖమ్మంరూరల్/కారేపల్లి: కారేపల్లి మండలం భాగ్యనగర్తండా గ్రామపంచాయతీ పరిధి లావుడ్యాతండాకు చెందిన బ్యాంకు మేనేజర్ ఖమ్మంలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. లావుడ్యాతండా గ్రామానికి చెందిన గుగులోతు అశోక్(37) ఖమ్మం రూరల్ మండలం కరుణగిరి సమీపాన శ్రీసాయి ఆదిత్య టౌన్షిప్లో ఉంటూ సూర్యాపేట జిల్లా కోదాడ యూనియర్ బ్యాంకులో మేనేజర్గా విధులు నిర్వర్తిస్తున్నాడు. సోమవారం విధులకు వెళ్తున్నట్లు చెప్పి ఇంటి నుంచి బయలుదేరిన ఆయన మధ్యాహ్నం తన ఇంటి సమీపంలోని వ్యక్తికి ఫోన్చేసి చెప్పి ప్రమాదంలో ఉన్నానంటూ చెప్పి లొకేషన్ పంపించాడు. దీంతో ఆయన వెళ్లి ఖమ్మం రూరల్ మండలం పల్లెగూడెం సమీపాన వెతకగా చెట్లపొదల్లో అశోక్ మృతదేహం కనిపించింది. ఆ పక్కనే పురుగుల మందు డబ్బా, బ్యాంక్ విధుల్లో ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటున్నట్లుగా సూసైడ్ నోట్ లభించింది. ఈమేరకు అశోక్ భార్య స్వాతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఖమ్మం రూరల్ ఎస్ఐ వెంకటకృష్ణ తెలిపారు.
కుటుంబ కలహాలతో వ్యక్తి..
తిరుమలాయపాలెం: కుటుంబ కలహాల కారణంగా ఓ వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. మండలలోని జూపెడకు చెందిన నూకల కటరెడ్డి(50) గ్రామంలో కిరాణం షాపు నిర్వహిస్తున్నాడు. కుటుంబ కలహాల నేపథ్యాన సోమవారం ఇంటినుంచి వెళ్లిపోయిన ఆయన మంగళవారం రాత్రి కాకరవాయి రహదారి పక్కన శవమై కనిపించాడు. కాగా, కటరెడ్డి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడనే సమాచారంతో పోలీసులు విచారణ చేపట్టారు.