సమష్టి కృషితోనే సంస్థ అభివృద్ధి | Sakshi
Sakshi News home page

సమష్టి కృషితోనే సంస్థ అభివృద్ధి

Published Sun, Nov 19 2023 12:16 AM

అవార్డులు అందుకున్న ఉద్యోగులతో ఆర్‌ఎం వెంకన్న, అధికారులు  - Sakshi

సత్తుపల్లిరూరల్‌: ఉద్యోగుల సమష్టి కృషితోనే సంస్థ అభివృద్ధి సాధ్యమవుతుందని ఆర్‌టీసీ ఖమ్మం రీజి నల్‌ మేనేజర్‌ సీహెచ్‌.వెంకన్న తెలిపారు. సత్తుపల్లి ఆర్టీసీ డిపోలో శనివారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన ఉద్యోగులకు రీజినల్‌ స్థాయి ప్రగతి చక్ర అవార్డులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆర్‌ఎం మాట్లాడుతూ.. ఆర్టీసీ అభివృద్ధికి డ్రైవర్లు, కండక్టర్లే కీలకమని తెలిపారు. ఉద్యోగులు బాధ్యతతో వ్యవహరిస్తే ఆదాయం పెరుగుతుందని చెప్పారు.

25మందికి అవార్డులు..

ఖమ్మం రీజినల్‌ పరిధిలోని ఏడు డిపోల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన పది మంది డ్రైవర్లు, ఏడుగురు కండక్టర్లు, ముగ్గురు టిమ్స్‌ డ్రైవర్లు, ఐదు అద్దె బస్సుల డ్రైవర్లు, ముగ్గురు మెకానిక్‌లను ఆర్‌ఎం సన్మానించారు. అదేవిధంగా ఉత్తమ బస్‌ స్టేషన్‌గా ఎంపికై న ఖమ్మం పాత బస్టాండ్‌ డిపో మేనేజర్‌ను సత్కరించారు. రీజియన్‌ నుంచి 25 మంది అవార్డులకు ఎంపిక కావడం సంతోషంగా ఉందని తెలిపారు. ప్రగతిచక్ర అవార్డులు పొందిన ఉద్యోగులను స్ఫూర్తిగా తీసుకొని మిగతా ఉద్యోగులు సంస్థ అభివృద్ధికి కృషి చేయాలన్నారు. కాగా, త్వరలోనే కొత్తగూడెం బస్‌స్టేషన్‌లో ఆర్టీసీ డిస్పెన్సరీ ఏర్పాటు చేస్తామని ఆర్‌ఎం వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సత్తుపల్లి, ఖమ్మం, భద్రాచలం, మణుగూరు డిపో మేనేజర్లు యు.రాజ్యలక్ష్మి, శ్రీనివాసరావు, రామారావు, స్వామి, ఉద్యోగులు పాల్గొన్నారు.

ఆర్టీసీ ఎదుగుదలలో డ్రైవర్‌, కండక్టర్లే కీలకం

ఖమ్మం రీజినల్‌ మేనేజర్‌ వెంకన్న

Advertisement
Advertisement