Sakshi News home page

కొత్త సర్కార్‌పైనే ఆశలు! ఆసరా కోసం ఎదురుచూపులు..

Published Mon, Dec 18 2023 12:06 AM

- - Sakshi

ఖమ్మం: రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడడంతో ఆసరా పెన్షన్‌ లబ్ధిదారుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. ఎన్నికలకు ముందు ఆరు గ్యారంటీల హామీలను ఇచ్చిన కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్రంలో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. హామీల్లో భాగంగా సీఎంగా రేవంత్‌రెడ్డి ప్రమాణస్వీకారం చేసిన తొలి రోజు ఆరు గ్యారంటీలపై సంతకం చేశారు.

ఈ గ్యారంటీల్లో ఆసరా పెన్షన్‌ అందుకుంటున్న లబ్ధిదారులకు చేయూత పథకం కింద రూ.4,000 లకు పెంచి అమలు చేస్తామని ప్రకటించింది. ప్రభుత్వం ఏర్పడడం, రెండు పథకాలను ఇప్పటికే ప్రారంభించడంతో ఆసరా లబ్ధిదారులు తమ గ్యారంటీ కూడా అమలవుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. చేయూత కింద ఇచ్చిన హామీల్లో రాజీవ్‌ ఆరోగ్యశ్రీకి రూ.10 లక్షలు పెంచి అమలు చేస్తున్న ప్రభుత్వం, పెన్షన్‌లను కూడా త్వరలోనే పెంచి అమలు చేస్తారని ఆశిస్తున్నారు.

ఉమ్మడి జిల్లాలో 3,11,008 మంది..
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఆసరా పెన్షన్‌ అందుకుంటున్న లబ్ధిదారులు 3,11,008 మంది ఉన్నారు. వీరిలో వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, చేనేత కార్మికులు, ఒంటరి మహిళలు, బీడీ కార్మికులు, ఏఆర్‌టీ, ఫైలేరియా, డయాలసిస్‌ బాధితులు ఉన్నారు. వికలాంగులకు ప్రస్తుతం రూ.4 వేల పెన్షన్‌ అందుతుండగా.. ఇతర లబ్ధిదారులకు రూ.2,016లు పెన్షన్‌ అందుతుంది. కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం చేయూత కింద వీరందరికి రూ.4 వేలు ఇస్తామని హామీ ఇచ్చింది. ఖమ్మం జిల్లాలో 1,91,548 మందికి నెలకు రూ.44,34,00,000లు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 1,19,460 మందికి నెలకు రూ.26,96,67,000లు పైగా చెల్లిస్తున్నారు. కొత్త ప్రభుత్వం చేయూత అమలు చేస్తే ఉమ్మడి జిల్లాలో పెన్షన్లకు చెల్లించాల్సిన నగదు భారీగా పెరగనుంది.

కేటగిరీల వారీగా పెన్షన్‌లు అందుకుంటున్న లబ్ధిదారుల సంఖ్య

ఇవి చ‌ద‌వండి: లబ్ధి చేకూరేలా.. ఫైల్‌ తొక్కి పెట్టిందెవరు?

Advertisement
Advertisement