అశ్వారావుపేటరూరల్: అశ్వారావుపేట మండలం నారంవారిగూడెం కాలనీ గ్రామానికి చెందిన ఆలిండియా భారత బంజార రత్న సాహస వీర్ పురస్కార అవార్డు గ్రహీత భూక్యా కృష్ణ నాయక్కు మరో అవార్డు దక్కింది. శనివారం ముంబయ్లో జరిగిన కార్యక్రమంలో ప్రముఖ పారిశ్రామికవేత్త, ఆలిండియా బంజారా సేవాసంఘ్(ఏఐబీఎస్ఎస్) అధ్యక్షుడు శంకర్ పవార్, కర్ణాటక గాయకుడు సుభాష్ రాథోడ్ చేతుల మీదుగా అఖండ భారత్ బంజారా భూషణ్ శస్త్రవీర్(స్టంట్) అవార్డు అందుకున్నాడు. ఈ సందర్భంగా కృష్ణ నాయక్ను ఘనంగా సత్కరించారు.
రెండు తలలు.. ఆరు కాళ్లు..
వింతగా దూడ జననం.. వెంటనే మృతి
చర్ల రూరల్: భద్రాద్రి జిల్లా చర్ల మండలంలోని జి.పి.పల్లి గ్రామంలో ఆదివారం బోరా శ్రీనివాసరెడ్డి అనే రైతుకు చెందిన ఆవు రెండు తలలు.. ఆరు కాళ్లు ఉన్న లేగదూడకు జన్మనిచ్చింది. అయితే వింత ఆకారంలో పుట్టిన ఈ దూడ గంట తర్వాత చనిపోయిందని రైతు తెలిపాడు. దూడను చూసేందుకు గ్రామస్తులు భారీగా తరలివచ్చారు. జన్యులోపంతోనే దూడలు ఇలా జన్మిస్తాయని ప్రభుత్వ పశు వైద్యాధికారి రవీందర్ తెలిపారు.
కిన్నెరసానిలో
పర్యాటకుల సందడి
పాల్వంచరూరల్ : పాల్వంచ మండలంలోని కిన్నెరసానికి ఆదివారం పర్యాటకులు భారీగా తరలివచ్చారు. జిల్లా నలుమూలలతో పాటు ఇతర ప్రాంతాల నుంచి కూడా వచ్చిన వారు.. డ్యామ్ పైనుంచి జలాశయాన్ని, డీర్పార్కులోని దుప్పులను వీక్షించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆనందోత్సాహాల నడుమ గడిపారు. 283 మంది పర్యాటకులు కిన్నెరసానిలోకి ప్రవేశించడం ద్వారా వైల్డ్లైఫ్ శాఖకు రూ.10,420 ఆదాయం లభించగా, 140 మంది బోటు షికారు చేయడంతో టూరిజం కార్పొరేషన్కు రూ.8,410 ఆదాయం లభించినట్లు నిర్వాహకులు తెలిపారు.