జిల్లాలో జోరుగా నకిలీ మద్యం దందా | Sakshi
Sakshi News home page

జిల్లాలో జోరుగా నకిలీ మద్యం దందా

Published Mon, Sep 25 2023 11:34 PM

- - Sakshi

ఆసిఫాబాద్‌కు చెందిన రాజేష్‌ మూడు రోజుల కిందట గుండి రహదారిలో ఉన్న ఓ మద్యం దుకాణానికి వెళ్లి క్వార్టర్‌ మద్యం తీసుకున్నాడు. ఇంటికెళ్లి బాటిల్‌ మూత తీయగానే స్పిరిట్‌ వాసన గుప్పుమంది. తాజాగా తయారైన మద్యం అనుకుని గ్లాసులో పోసుకుని తాగగా.. నిజంగా స్పిరిట్‌ తాగిన భావన. నిత్యం తాగే బ్రాండ్‌ ఇలా ఉందేమని.. మరుసటి రోజు బ్రాందీ షాపుకెళ్లి ఫిర్యాదు చేశాడు. సాయంత్రానికి షాపు లైసెన్సుదారుడు రాజేష్‌కి ఫోన్‌ చేసి ‘ఏ బ్రాండు తీసుకున్నావు? స్పిరిట్‌ వాసన వచ్చిందా? నేను చెక్‌ చేస్తాను.. ఎవరితో చెప్పకు’ అని కోరాడు.

►​​​​​​​ శ్రీధర్‌ అనే మరో వ్యక్తి రెండు రోజుల కిందట ఖరీదైన విస్కీ బ్రాండు మద్యం బాటిళ్లు కొనుగోలు చేశాడు. స్నేహితులతో కలిసి పార్టీలో మద్యం బాటిళ్లను ఓపెన్‌ చేసి గ్లాసుల్లో పెగ్‌లు పోయగా.. వాటిని తాగిన స్నేహితులందరూ ఇది నకిలీ మద్యం.. స్పిరిట్‌ వాసన వస్తోందని అనడంతో శ్రీధర్‌ కంగుతిన్నాడు. ఆసిఫాబాద్‌లోని చిర్రకుంట వెళ్లే రహదారిలో ఉన్న ఓ మద్యం దుకాణంలో శ్రీధర్‌ ఈ బాటిళ్లను కొనుగోలు చేసినట్లు తెలిసింది.

సాక్షి, ఆసిఫాబాద్‌: జిల్లాలో నకిలీ మద్యం ఏరులై పారుతోంది. జిల్లావ్యాప్తంగా ఈ రకం మద్యం విక్రయించని వైన్స్‌ లేదంటే అతిశయోక్తి కాదు. నిబంధనలకు విరుద్ధంగా అనేక మద్యం షాపుల్లోనూ లభి స్తోంది. నవంబర్‌ తర్వాత పాత వైన్స్‌ షాపుల స్థానంలో కొత్తవి రానుండడంతో పాత షాపుల య జమానులు కొందరు నకిలీ మద్యం దందాను ప్రో త్సహిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. పోలీసు ఉ న్నతాధికారులు, ఆబ్కారీ ఉన్నతాధికారులకు మా మూళ్లు ఇస్తున్నామనే భావనతో.. చివరి రోజుల్లోనైనా కొంత లాభాలు దక్కించుకునేందుకు లైసెన్సుదారులు నకిలీ మద్యాన్ని విక్రయిస్తున్నట్లు సమాచారం. దీనిని అరికట్టాల్సిన సంబంధిత అధికారులు మామూళ్ల మత్తులో తనిఖీలు గాలికొదిలేస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

కాగజ్‌నగర్‌ అడ్డాగా..
జిల్లాలో 32 మద్యం దుకాణాలు, 3 బార్లు ఉన్నా యి. ఏటా రూ.250 కోట్ల మద్యం అమ్ముడవుతోంది. వీటికి అనుసంధానంగా మండల కేంద్రాల్లో ప దుల సంఖ్యలో బెల్టు షాపులు ఉండగా.. జిల్లావ్యాప్తంగా వాటి సంఖ్య 800 వరకు ఉంటుంది. నవంబర్‌తో ప్రస్తుత మద్యం షాపులకు గడువు పూర్తవుతోంది. డిసెంబర్‌ నుంచి కొత్తగా మద్యం దుకా ణాలను టెండర్ల ద్వారా దక్కించుకున్న లైసెన్సుదారులు ఏర్పాటు చేయనున్నారు. ఇదే అదనుగా ప్రస్తుతం ఉన్న లైసెన్సుదారులు తమ మద్యం దు కాణాల్లో నకిలీ మద్యం విక్రయాలకు తెరలేపినట్లు సమాచారం. ముఖ్యంగా కాగజ్‌నగర్‌ అడ్డాగా నకిలీ మద్యం తయారవుతోంది. అసలు బాటిళ్ల మా దిరిగా ఉండే నకిలీ బ్రాండ్లను షాపుల్లో ఉంచి మందుబాబులకు అంటగడుతూ రూ.లక్షలు అర్జిస్తున్నారు. ఒకప్పుడు చీప్‌ లిక్కర్లలో కల్తీ జరిగేది. కానీ ప్రస్తుతం ఖరీదైన బ్రాండ్లనూ నకిలీగా తయారు చేయడం విశేషం. ఇదే విషయమై జిల్లా ఎక్సైజ్‌శాఖ అధికారి జ్యోతికిరణ్‌ను వివరణ కోరేందుకు ‘సాక్షి’ ఫోన్‌లో సంప్రదించగా ఆయన స్పందించలేదు.

జోరుగా దందా..
ప్రస్తుతం ఉన్న మద్యం దుకాణాల నిర్వహణ గడువు ఈ ఏడాది నవంబర్‌ నెలాఖరుతో ముగియనుంది. ఇటీవలే కొత్త దుకాణాలను లాటరీ పద్ధతిలో కేటాయించిన విషయం తెలిసిందే. ఇదే తరుణంలో ప్రస్తుతం ఉన్న మద్యం లైసెన్సుదారులు అక్రమార్జనకు అడ్డదారులు వెతుక్కున్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు బీరు, ఇతర ప్రీమియం మద్యం బాటిళ్లపై ధర పెంచి విక్రయించి సొమ్ము చేసుకున్న సంగతి విధితమే. ఇప్పుడంతకు మించి అర్జించాలంటే నకిలీ మద్యం ఒక్కటే మార్గమని భావించి అసలు బ్రాండ్ల స్థానంలో నకిలీ మద్యం బ్రాండ్‌ బాటిళ్లను ఉంచి విక్రయిస్తున్నట్లు సమాచారం. 

జిల్లాలో కేవలం కొన్ని దుకాణాల్లో మాత్రం నకిలీ మద్యం విక్రయాలు జరగడం లేదని తెలుస్తోంది. స్థానికుల్లో చాలా మంది మంచిర్యాల, పొరుగున ఉన్న మహారాష్ట్రకు వెళ్లి మద్యం బాటిళ్లు కొనుగోలు చేస్తున్నారంటే జిల్లాలో నకిలీ మద్యం ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోంది. చాటుగా కాకుండా ఏకంగా మద్యం దుకాణాల్లోనే నకిలీ మద్యం బాటిళ్లను ఉంచి విక్రయిస్తున్నా సంబంధిత అధికారులు స్పందించడం లేదు.

Advertisement
Advertisement