–సెర్ప్ సీఈఓ ఏఎండీ ఇంతియాజ్
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): భారతమాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం స్ఫూర్తితో విద్యార్థులు శాస్త్రవేత్తలుగా ఎదగాలని సెర్ప్ సీఈఓ ఏఎండీ ఇంతియాజ్ ఆకాంక్షించారు. డీపీఆర్టీయూ కార్యాలయంలో డెమొక్రటిక్ పీఆర్టీయూ, ఉపాధ్యాయ సేవాదళ్ సంయుక్తంగా కలాం జయంతి నిర్వహించారు. తొలుత కలాం చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వైజ్ఞానిక ప్రదర్శనలో రాణించిన విద్యార్థులు, గైడ్ టీచర్లకు కలాం పురస్కారాలు ప్రదానం చేశారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన సెర్ప్ సీఈఓ ఇంతియాజ్ మాట్లాడుతూ ఏపీజే అబ్దుల్ కలాం స్ఫూర్తితో నేటి విద్యార్థులు భారతదేశ ప్రతిష్టను పెంచే మహోన్నతమైన శాస్త్రవేత్తలుగా ఎదగాలని ఆకాంక్షించారు. ఎమ్మెల్సీ కల్పలతా రెడ్డి మాట్లాడుతూ అంతర్జాతీయ స్థాయిలో డల్లాస్లో నిర్వహించిన వైజ్ఞానిక ప్రదర్శనలో రాణించిన విద్యార్థులను గైడ్ టీచర్లను, ప్రధానోపాధ్యాయులను కలాం పురస్కారాలతో సత్కరించడం అభినందనీయమన్నారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన డి.శ్రీను మాట్లాడుతూ 100 మంది విద్యార్థులు, ఉపాధ్యాయులకు కలాం పురస్కారాలు అందజేశామన్నారు. గవర్నమెంట్ ఎగ్జామ్స్ డైరెక్టర్ దేవానందరెడ్డి, లయన్స్ క్లబ్ నాయకులు ఉపేంద్ర, నీలిమ దేవి ట్రస్ట్ చైర్మన్ అబ్రహాం లింకన్, పి. వెంకటేశ్వరరావు, ప్రభాకర్, దర్శి రాంబాబు, జ్ఞానేశ్వర్రావు, అక్బర్ బాషా తదితరులు పాల్గొన్నారు.