చిలకలపూడి(మచిలీపట్నం): మచిలీపట్నం పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ప్రధాన మంత్రి గ్రామ సడక్ యోజన పథకం ద్వారా ఎనిమిది రహదారులు, ఆరు వంతెనల నిర్మాణానికి నిధులు మంజూరైనట్లు బందరు పార్లమెంట్ సభ్యుడు వల్లభనేని బాలశౌరి శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. కేంద్ర గ్రామీణ అభివృద్ధిశాఖ, రాష్ట్ర ప్రభుత్వం కలిపి ఈ నిధులు విడుదలకు పరిపాలనా ఉత్తర్వులు మంజూరు చేసినట్లు బాలశౌరి తెలిపారు. ఈ అభివృద్ధి పనులకు టెండర్లు పిలిచి త్వరలోనే పనులు ప్రారంభిస్తామని చెప్పారు.
రహదారులు ఇవే..
పార్లమెంట్ పరిధిలో అవనిగడ్డ నియోజకవర్గంలోని అవనిగడ్డ మండలం మోదుమూడి నుంచి లింగారెడ్డిపాలెం వరకు 5.2 కిలోమీటర్ల రహదారికి రూ. 5.13కోట్లు, కోడూరు మండలంలోని మందపాకల నుంచి ఇరాలీ వరకు రోడ్డుకు రూ. 4.14 కోట్లు, నాగాయలంక మండలంలోని గణపేశ్వరం నుంచి పెదపాలెం వరకు రూ. 3.30 కోట్లు, గన్నవరం నియోజకవర్గం బాపులపాడులో ఎంఎన్కే నుంచి రామన్నగూడెం వరకు రూ. 5.77 కోట్లు, వీరులపాడు మండలం జుజ్జూరు నుంచి వెల్లంకి రూ. 1.83 కోట్లు, పెడన నియోజకవర్గం కృత్తివెన్ను మండలం బీఎల్ రోడ్డు నుంచి గరిశిపూడి వరకు రూ.4.25 కోట్లు, పామర్రు నియోజకవర్గంలోని ఎంవీ రోడ్డు నుంచి సత్యనారాయణపురం వరకు రూ. 4.97 కోట్లు, పెనమలూరు నియోజకవర్గం ఉయ్యూరు ఎంవీ రోడ్డు నుంచి నాగన్నగూడెం వరకు రూ. 5.20 కోట్లు మంజూరయ్యాయన్నారు.
వివరాలు వెల్లడించిన బందరు ఎంపీ బాలశౌరి
ఆరు బ్రిడ్జిలు ఇవే..
పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ఆరు లాంగ్ స్పాన్ బ్రిడ్జిలు మంజూరైనట్లు తెలిపారు. వీటికి రూ. 42.64 కోట్లు మంజూరయ్యాయని ఎంపీ చెప్పారు. పెడన నియోజకవర్గం బంటుమిల్లి మండలం పెదతుమ్మిడి నుంచి సాతులూరు రోడ్డుపై రూ. 3.87 కోట్లతో వంతెన నిర్మాణం, గూడూరు మండలం పెడన నుంచి పర్ణశాల వెళ్లే రోడ్డులో లజ్జబండ డ్రెయిన్పై వంతెన నిర్మాణానికి రూ. 3.48 కోట్లు కేటాయించారన్నారు. బందరు మండలం పోతిరెడ్డిపాలెం నుంచి వాడరేవుపాలెం రోడ్డులో లజ్జబండ డ్రెయిన్పై రూ. 21.16 కోట్లతో వంతెన, బందరు పోర్టు నుంచి పల్లెతుమ్మలపాలెం వెళ్లే రోడ్డులో గుండేరు డ్రెయిన్పై రూ. 2.78 కోట్లు, పోర్టు నుంచి పోలాటితిప్ప రోడ్డులో మెడిమేరు డ్రెయిన్ వద్ద రూ. 2.37 కోట్లతో వంతెన నిర్మాణానికి నిధులు మంజూరైనట్లు ఎంపీ బాలశౌరి తెలిపారు.