పెనమలూరు: ఎన్నికల్లో ఓటు వేయటానికి అర్హత ఉన్న ప్రతి ఒక్క ఓటరును తమ ఓటు హక్కు వినియోగించుకునే విధంగా భాగస్వామ్యం చేయటం ఎంతో అవసరమని కృష్ణా జిల్లా కలెక్టర్ బి.రాజాబాబు అన్నారు. జిల్లా యంత్రాంగం ఆదివారం నిర్వహించిన సిస్టమేటిక్ ఓటర్స్ ఎడ్యుకేషన్ అండ్ ఎలక్ట్రోరల్ పార్టిసిపేషన్ (స్వీప్) కార్యక్రమంలో భాగంగా తాడిగడప జంక్షన్ వద్ద జెండా ఊపి 3కే రన్ ప్రారంభించారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటుకు ఉన్న విలువను అందరూ గుర్తించాలని అన్నారు. ఎన్నికల సమయంలో ఓటరు తమ ఓటు హక్కు తప్పక వినియోగించుకోవాలని సూచించారు. ఓటర్లను చైతన్య పరిచే విధంగా బూత్లెవల్ అధికారులతో పాటు అందరు తమ వంతు పాత్ర పోషించాలని తెలిపారు. ఓటర్ల జాబితాలో లోపాలు లేకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు.
యువత ఓటు నమోదు చేసుకోవాలి..
యువ ఓటర్లు తమ ఓటు హక్కును నమోదు చేసుకోవాలని కలెక్టర్ పి.రాజాబాబు అన్నారు. యువత చైతన్య వంతులై తమ ఓటు నమోదు చేసుకొని ఎన్నికల్లో కీలక పాత్ర పోషించాలని తెలిపారు. 3కే రన్లో అన్ని శాఖల ఉద్యోగులు, కళాశాలల విద్యార్థులు, స్థానిక ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు. కార్యక్రమంలో ఆర్డీఓ డి.రాజు, జిల్లా పరిషత్ సీఈఓ జ్యోతిబసు, సిద్ధార్థ డీన్ బావినేని పాండురంగారావు పాల్గొన్నారు.
కృష్ణా జిల్లా కలెక్టర్ రాజాబాబు