చిలకలపూడి(మచిలీపట్నం): వినియోగదారులు హక్కుల గురించి తెలుసుకోవాలని కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్ అపరాజితాసింగ్ అన్నారు. జాతీయ వినియోగదారుల దినోత్సవం సందర్భంగా పౌరసరఫరాలశాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్లోని సమావేశపు హాలులో శనివారం ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జేసీ మాట్లాడుతూ వినియోగదారుల హక్కుల పరిరక్షణ చట్టం పటిష్టంగా అమలు చేయాలన్నారు. నగరంలో వివిధ పాఠశాలలు, కళాశాలల విద్యార్థులకు కన్స్యూమర్ ప్రొటెక్షన్ ఇన్ ది ఎరా ఆఫ్ ఈ–కామర్స్ అండ్ డిజిటల్ ట్రేడ్ అంశంలో వ్యాసరచన, క్విజ్, వక్తృత్వ పోటీల్లో తెలుగు, ఇంగ్లిష్ మాధ్యమాల్లో విజేతలకు జేసీ ప్రశంసాపత్రాలతో పాటు నగదు బహుమతులను అందజేశారు. తూనికలు, కొలతలు శాఖ సహాయ అధికారి టి. రాజేంద్ర మాట్లాడుతూ ప్రతి వస్తువు ఎమ్మార్పీ కంటే అధికంగా అమ్మకూడదని తూనికలు, కొలతల్లో ఎటువంటి వ్యత్యాసాలు ఉన్నా వినియోగదారులు టోల్ఫ్రీ నంబర్ 1967కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చన్నారు. కార్యక్రమంలో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ సాధిక్, వినియోగదారుల సంఘ ప్రతినిధి సైకం భాస్కరరావు, డీఎస్వో వి. పార్వతి తదితరులు పాల్గొన్నారు.