జగ్గయ్యపేట అర్బన్: జగ్గయ్యపేటకు చెందిన స్విమ్మర్లు జాతీయ స్థాయిలోనే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో కూడా ప్రతిభ కనబరచి అవార్డులు సాధించడం అభినందనీయమని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే సామినేని ఉదయభాను అన్నారు. డిసెంబర్ 24న కర్నూలులో మాస్టర్స్ ఆక్వాటిక్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా వారి ఆధ్వర్యంలో ఏపీ మాస్టర్ స్విమ్మింగ్ అసోసియేషన్ నిర్వహించిన 6వ స్టేట్ చాంపియన్షిప్ ఈత పోటీల్లో ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట ప్రాంత డ్రీమర్స్ స్విమ్మర్స్ అసోసియేషన్ 32 మందితో కూడిన స్విమ్మర్ల జట్టు పాల్గొంది. వారిలో 27 మంది ఉత్తమ ప్రతిభ ప్రదర్శించి 93 పతకాలు సాధించారు. వాటిలో 64 స్వర్ణం, 21 రజిత, 8 కాంస్య పతకాలు ఉన్నాయి. ఈ సందర్భంగా శుక్రవారం స్థానిక ఉక్కు కళావేదికలో పేట డ్రీమర్స్ స్విమ్మింగ్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో జరిగిన అభినందన కార్యక్రమంలో పతకాలు సాధించిన వారిని ఎమ్మెల్యే సామినేని ఉదయభాను సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఆయన మాట్లాడుతూ డ్రీమర్స్ స్విమ్మర్స్ అసోసియేషన్ కోచ్ దంపతులు పొట్టబత్తిన పాండురంగారావు, లక్ష్మిలను అభినందించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రాఘవేంద్ర, వైఎస్సార్ సీపీ పట్టణ అధ్యక్షుడు ఆకుల శ్రీకాంత్, కృష్ణా స్విమ్మర్స్ వ్యవస్థాపక అధ్యక్షుడు డీఎస్పీ ఎం.కిషోర్బాబు, ఎంఏఎఫ్ఏఐ జనరల్ సెక్రటరీ జె.లక్ష్మీనారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.